
పాన్ ఇండియా స్టార్, తెలుగు ఆడియెన్స్ ముద్దుగా పిలుచుకునే డార్లింగ్, టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదివారం తన 43వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేశారు. లోకల్గానే కాదు, విదేశాల్లోనూ డార్లింగ్ అభిమానులు తమదైన స్టయిల్లో ప్రభాస్ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. దీంతో ఆదివారం మొత్తం ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్ ఓ పండగలా జరిగాయి.
అయితే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన `బిల్లా` చిత్రాన్ని రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని 4కే వెర్షన్లో ఏపీ, తెలంగాణతోపాటు విదేశాల్లోనూ రిలీజ్ చేశారు. వీటికి విశేష స్పందన లభించింది. అభిమానులు థియేటర్లలో సినిమాని బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఓ థియేటర్ లో అపశృతి చోటు చేసుకుంది. అభిమానుల సంబరాలు శృతి మించడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
పశ్చిమగోదావరి జిల్లా తాడెపల్లి గూడెంలోని వెంకట్రామ థియేటర్ లో అభిమానులు బాణాసంచా కాల్చారు. ఆ నిప్పులు సీట్లకి అంటుకోవడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అభిమానుల అత్యుత్సాహం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన అభిమానులు, థియేటర్ యాజమాన్యం మంటలను ఆర్పారు. ఈ ఘటన వైరల్గా మారింది. అయితే దీనిపై సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ స్పందించారు. తనదైన స్టయిల్ ట్వీట్లతో రెచ్చపోవడంతో అవి వైరల్ అవుతున్నాయి.
థియేటర్ లో ప్రభాస్ అభిమానులు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్న ఓ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ చర్యని ఖండించారు. ఇది దీపావళి వేడుక కాదు. తన సినిమా తెరపై నడుస్తుండగా, థియేటర్ని తగలబెట్టి సంబరాలు చేసుకోవడం ప్రభాస్ అభిమానుల పిచ్చ చర్య అంటూ పోస్ట్ పెట్టారు. అ తర్వాత ఇది ప్రభాస్ స్టయిల్ ఆఫ్ దీపావళి సెలబ్రేషన్ అంటూ మరో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్గా మారాయి. దీనిపై రకరకాల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.