
గేమ్ ఛేంజర్ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా భారతీయుడు 2 తెరపైకి వచ్చింది. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 చిత్రీకరణ వివాదంతో ఆగిపోయింది. విక్రమ్ మూవీ సక్సెస్ కావడంతో మేకర్స్ కి ఆశలు చిగురించాయి. కమల్ హాసన్ ఫార్మ్ లోకి వచ్చిన నేపథ్యంలో కొంతలో కొంత క్యాష్ చేసుకోవచ్చని వివాదాలు పక్కన పెట్టి శంకర్ తో కాంప్రమైజ్ అయ్యారు. దీంతో శంకర్ రెండు బాధ్యతలు తలకెత్తుకున్నాడు.
గేమ్ ఛేంజర్, భారతీయుడు 2 ఏక కాలంలో తెరకెక్కిస్తున్నాడు. ఆయన ఫోకస్ భారతీయుడు 2 మీదనే ఎక్కువగా ఉందట. రామ్ చరణ్ మూవీ అసిస్టెంట్స్ తో లాగించేస్తున్నాడట. దానికి తోడు ఉపాసన డెలివరీని కోసం రామ్ చరణ్ కొన్నాళ్ళు షూటింగ్ లో పాల్గొనలేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో 50వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ నానా కష్టాలు పడుతుంది. దిల్ రాజు కూడా శంకర్ పట్ల అసహనంగా ఉన్నారు.
రామ్ చరణ్ బర్త్ డే కానుకగా టైటిల్ అండ్ లుక్ విడుదల చేశారు. మరలా అప్డేట్ లేదు. దీంతో విసిగిపోయిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నెగిటివ్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజును ఏకిపారేస్తున్నారు. వేక్ అప్ శంకర్(నిద్ర లే) అంటూ దర్శకుడి మీద ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. దిల్ రాజుని అయితే దారుణంగా సిగ్గు లేదంటూ (#UselessDilRajuShamelessSVC) ఓ ట్యాగ్ వైరల్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ నుండి ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేయాలని కోరుకుంటున్నారు.
రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకున్న నేపథ్యంలో మేకర్స్ అప్డేట్ ఇస్తారో లేదో చూడాలి. గేమ్ ఛేంజర్ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా గేమ్ ఛేంజర్ తెరకెక్కుతుంది. రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.