
టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ప్రీత్సింగ్ తెలుగులో దాదాపు అందరు హీరోలతో జత కట్టింది. ఈ ఢిల్లీ భామ కాలేజ్లో ఉండగానే మోడలింగ్ చేసి.. 19 ఏళ్లకే వెండితెర అరంగేట్రం చేసింది. తెలుగులో‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’తో విజయం అందుకున్నా.. మరో రెండేళ్ల వరకు ఆమెకు అవకాశాలు పెద్దగా దక్కలేదు. ఆ సమయంలో ఏం జరిగిందనేది ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది రకుల్.
‘తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటి ఉందని కూడా ఇక్కడకు వచ్చే వరకు నాకు తెలియదు. అలాంటి టైమ్లో పాకెట్ మనీ కోసం ఓ కన్నడ సినిమా చేశా. ఆ తర్వాత పూరీ జగన్నాథ్గారు నాకో కథ చెప్పారు. కానీ, చదువు పాడవుతుందని ఆ సినిమా చేయలేదు. ఆ తర్వాత తెలుగులో ‘కెరటం’ అనే సినిమాలో ఓ ఐదు నిమిషాల రోల్ చేశాను. ఇక, యాక్టింగ్ను సీరియస్గా తీసుకుందామనుకున్న తరుణంలో ప్రభాస్ హీరోగా చేసిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలో నాకు అవకాశం వచ్చింది.
మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమాలో నాలుగు రోజులు షూటింగ్లో కూడా పాల్గొన్నాను. ఎందుకనో నాలుగు రోజుల షూటింగ్ తర్వాత నన్ను తీసేశారు. కారణం నాకు ఇప్పటికీ తెలియదు. ఆ సినిమా నుంచి నన్ను తీసేసిన తర్వాత ‘మిస్ ఇండియా’ పోటీల కోసం ఢిల్లీ వచ్చేశాను. ఆ కాంపిటీషన్స్లో పలు విభాగాల్లో ఐదు టైటిల్స్ గెలుచుకున్నాను. ఆ తర్వాత ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ చేశాను. ఆ సినిమా విజయం సాధించినా నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్ని పెద్ద సినిమాలకు ముందు నన్ను తీసుకుని తర్వాత మార్చేసేవార’ని చెప్పింది రకుల్.