
న్యూఢిల్లీ: భారత చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సూపర్ స్టార్ రజనీకాంత్ పొందారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఈ రోజు ఢిల్లీలో అవార్డును రజనీకాంత్కు ప్రదానం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ రోజు 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ వేడుకకు రజనీకాంత్, ఆయన కూతురు, అల్లుడు ఐశ్వర్య, ధనుశ్లూ హాజరయ్యారు. అసురన్ చిత్రంలో ఉత్తమ నటుడిగా ధనుశ్ మరో నటుడు మనోజ్ బాజ్పాయ్తో కలిసి పురస్కారాన్ని పొందారు. ఉత్తమ నటిగా మణికర్ణిక చిత్రంలో నటనకు గాను కంగనా రనౌత్ ఉత్తమ నటిగా అవార్డు పొందారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి పురస్కారాన్ని పొందిన తర్వాత రజనీకాంత్ మాట్లాడారు. రజనీకాంత్ సినీ పరిశ్రమకు రాకపూర్వం బస్ కండక్టర్గా పనిచేసిన సంగతి విధితమే. ఆ సందర్భంలో రజనీకాంత్లో నటనను చూసిన తన ఫ్రెండ్ బస్ డ్రైవర్ రాజ్ బహదూర్ను గుర్తుచేశారు. తాను పొందిన ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఫ్రెండ్ రాజ్ బహదూర్కు అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. తాను బస్ కండక్టర్గా ఉన్నప్పుడు మిత్రుడు డ్రైవర్ రాజ్ బహదూర్ తనలోని యాక్టింగ్ స్కిల్ను, టాలెంట్ను గుర్తించాడని, ఆయనే తనను సినీ పరిశ్రమలోకి వెళ్లాల్సిందిగా ప్రోత్సహించినట్టు తెలిపారు.
Also Read: 67th National awards:నేషనల్ అవార్డ్స్ అందుకున్న రజిని, ధనుష్, కంగనా... సత్తా చాటిన తెలుగు సినిమా!
డ్రైవర్ రాజ్ బహదూర్తోపాటు దివంగత సినీ డైరెక్టర్ కే బాలచందర్, సోదరుడు సత్యనారాయణ రావులకూ ఈ అవార్డును అంకితమిస్తున్నట్టు వివరించారు. తన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, థియేటర్ యజమానులు, టెక్నీషియన్లు, ఫ్యాన్స్కు డెడికేట్ చేస్తున్నట్టు తెలిపారు.
సింగర్ ఆశా భోంస్లే, శంకర్ మహదేవన్, నటులు మోహన్లాల్, బిశ్వజిత్ చటర్జీ, ఫిలిం మేకర్ సుభాశ్ ఘాయ్లతో కూడిన జ్యూరీ ఈ ఏడాది తొలినాళ్లలో దాదాసాహెబ్ అత్యున్నత పురస్కారానికి రజనీకాంత్ను ఎంపిక చేసింది. తాజాగా, ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. రజనీకాంత్ టాలెంటెడ్ పర్సన్ అని, ఆయన డౌన్ టు ఎర్త్ అని ఈ రోజు అవార్డు ప్రదానోత్సవ వేడుకలో యాక్టర్ బిశ్వజిత్ చటర్జీ ప్రశంసించారు.