
సోషల్ మీడియా జనం మీడియా వాళ్లకు పోటీ ఇస్తున్నారు. ఎక్కడ లేని లాజిక్ లు లాగుతూంటారు. ఇదిగో ఇప్పుడు మహేష్, త్రివిక్రమ్ సినిమా లాంచ్ అయ్యింది. త్వరలో మహేష్ ప్రాజెక్టు మొదలు కానుందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే అదే సమయంలో కొందరు ఈ సినిమా మొదలైందంటే ఖచ్చితంగా రాజమౌళితో సినిమా ఇప్పట్లో లేనట్లేగా అని లాజిక్ లు లాగుతున్నారు. అందుకు కారణం గతంలో స్వయంగా రాజమౌళి...మహేష్ సినిమాని కన్ఫర్మ్ చేయటమే.
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మీ నెక్ట్స్ మూవీ ఎవరితో ఉండొచ్చు అని రాజమౌళిని ఓ విలేఖరి ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానమిస్తూ.. ‘‘నా నెక్ట్స్ మూవీ మహేష్ బాబుతో ఉంటుంది. ఈ విషయాన్ని ఇది వరకే చెప్పేశాను. అయితే ఇప్పుడా సినిమా గురించి ఆలోచించే పరిస్థితులు లేవు. RRR సినిమా విడుదలై.. అందరూ సినిమాను ఆదరించి బ్రహ్మాండంగా ఉందని చెప్పిన తర్వాతే మహేష్ సినిమా గురించి ఆలోచిస్తాను’’ అని అన్నారు రాజమౌళి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని వార్తలు వచ్చాయి.
ఇక సూపర్స్టార్ మహేశ్బాబు తదుపరి ప్రాజెక్ట్ మొదలైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. మహేశ్బాబు 28వ చిత్రంగా ఇది సిద్ధం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఉదయం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో వేడుకగా జరిగింది. చిత్రబృందంతోపాటు మహేశ్బాబు సతీమణి నమ్రత ఈ వేడుకలో పాల్గొన్నారు. పూజాహెగ్డే సైతం తళుక్కున మెరిశారు. ఇక మహేశ్బాబు ఎప్పటిలాగే ఈ వేడుకకు దూరంగా ఉన్నారు.
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి. ఓ పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేశ్ సరసన పూజాహెగ్డే సందడి చేయనున్నారు. ‘మహర్షి’ తర్వాత ఈ సినిమా కోసమే వీరిద్దరి కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు మహేశ్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ షూట్లో బిజీగా ఉన్నారు.