
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి వల్లే పాన్ ఇండియా చిత్రాల హవా పెరిగింది అనేది వాస్తవం. ఇండియా సినిమా భాషా బేధాలు తొలగించిన రాజమౌళి ప్రశంసలు దక్కించుకుంటున్నారు. అంతర్జాతీయంగా కూడా రాజమౌళి పేరు మారుమోగుతోంది. స్టీవెన్ స్పీల్ బర్గ్ , జేమ్స్ కామెరూన్ లాంటి మహామహులు కూడా జక్కన్న టేకింగ్ కి ఫిదా అయ్యారు.
ఇటీవల చెన్నైలో జరిగిన డైరెక్టర్స్ సమ్మిట్ లో రాజమౌళి, మణిరత్నం, సుకుమార్ లాంటి దర్శకులు పాల్గొన్నారు. ఈ కారక్రమంలో వీరి ముగ్గురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం.. రాజమౌళి తనని ఎలా ఇన్స్పైర్ చేశారో.. పొన్నియన్ సెల్వం చిత్రం పూర్తి కావడానికి ఎలా కారణం అయ్యాడో వివరించారు.
మీ అందరికి తెలుసు.. పొన్నియన్ సెల్వం చిత్రం తెరకెక్కించడానికి నేను ఎన్నో ఏళ్ళు ఎదురుచూశాను. అంత పెద్ద చిత్రం రూపొందించడానికి నాకు సరైన మార్గం కనిపించలేదు. అప్పుడే బాహుబలి చిత్రం వచ్చింది.. అది కూడా రెండు భాగాలుగా వచ్చి ప్రేక్షకులని మెప్పించింది. అప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి. పెద్ద కథలని ఇలా కూడా చెప్పవచ్చు అని అప్పుడే అనిపించింది.
బాహుబలి రెండు భాగాలుగా రాకపోయి ఉంటే పొన్నియన్ సెల్వం సాధ్యం అయ్యేది కాదు అని మణిరత్నం అన్నారు. వెంటనే రాజమౌళి స్పందిస్తూ.. సర్ ఇది నాకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అని మణిరత్నంతో అన్నారు.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై అవార్డులు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డుకి అడుగు దూరంలో ఉంది.