
మన పాన్ ఇండియా చిత్రాలు 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' కూడా వాయిదా పడే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగుతోంది. ఇప్పుడు నిజంగానే ఈ సినిమా పోస్ట్ ఫోన్ అయినట్లు సమాచారం. యుఎస్ థియోటర్ చైన్స్ కు ఆల్రెడీ వాయిదా పడినట్లు కమ్యునికేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఇంక ఈ రోజు ఇక్కడ వాయిదా అఫీషియల్ ప్రకటన రానుందని మీడియా వర్గాల్లో వినిపిస్తోంది. దానికి తోడు ఆ వార్తలు నిజమయ్యేలా 'రాధేశ్యామ్' మూవీ దర్శకుడు ఓ ట్వీట్ చేశాడు.
"కొన్నిసార్లు సమయం కూడా కఠినంగా మారుతుంది. హృదయాలు బలహీనంగా మారుతాయి. మనస్సులు అల్లకల్లోలంగా ఉంటాయి. జీవితం మనకు ఏది ఇచ్చినా.. మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉండాలి. సురక్షితంగా ఉండండి - టీమ్ రాధేశ్యామ్" అంటూ దర్శకుడు రాధేశ్యామ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ను పరిశీలించిన కొందరు సినీ విశ్లేషకులు.. 'రాధేశ్యామ్' విడుదల వాయిదా కానుందని స్పష్టం చేశారు. పరోక్షంగా రాధేశ్యామ్ టీమ్ తరఫున సినిమాను వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు తెలియజేస్తున్నట్లు ఉంది.
మరో ప్రక్క ఈ సినిమా రిలీజ్ డేట్ సమీపిస్తున్నా.. 'రాధేశ్యామ్' చిత్రటీమ్ ఎలాంటి ప్రమోషన్స్ చేపట్టడం లేదు. ఈ పరిస్థితులను బట్టి సినిమా రిలీజ్ వాయిదా తప్పదని తెలుస్తోంది. అదే నిజమైతే.. సంక్రాంతి బరిలో ఈసారి పెద్ద సినిమాలు విడుదల కావని తెలుస్తోంది.
వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ పూర్తిస్థాయి లవర్బాయ్ పాత్ర పోషించారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడి(palmist) పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్, పోస్టర్ లలో ప్రభాస్ లుక్, డైలాగ్లు, హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. జస్టిన్ ప్రభాకరణ్ అందించిన సంగీతం హత్తుకునేలా ఉంది. ‘బాహుబలి’, ‘సాహో’ వంటి యాక్షన్ ఎంటర్టైన్మెంట్స్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అలాగే ‘‘నువ్వు ఎవరో నాకు తెలుసు. కానీ, నీకు చెప్పను. నీ హృదయం ఎప్పుడు ముక్కలవుతుందో నాకు తెలుసు. కానీ, నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు. కానీ, నీకు చెప్పను. నీ చావు నాకు తెలుసు. కానీ, నీకు చెప్పను. నాకు అన్నీ తెలుసు. కానీ, నీకు చెప్పను. ఎందుకంటే, చెప్పినా అది మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య. నేను దేవుడ్ని కాదు. మీలో ఒక్కడిని కూడా కాదు’’ అంటూ టీజర్లో ప్రభాస్ పలికిన డైలాగులు సినిమాపై ఆసక్తిరేకెత్తించేలా ఉన్నాయి.
గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్. 70ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో రూపొందుతోంది. ఇది కాలం, జాతకాలతో ముడిపడి ఉన్న ప్రేమ కథ.
Also Read : Mahesh Babu:“పుష్ప ది రైజ్” పై మహేష్ కీలక కామెంట్స్