
మల్టీప్లెక్స్ అనగానే మనకు పీవీఆర్ గుర్తు వస్తుంది. తాజాగా ఈ సంస్ద ఎవరూ ఊహించని షాకింగ్ డెసిషన్ తీసుకుంది .దేశ వ్యాప్తంగా 50స్క్రీన్లని మూసివేయనుంది పీవీఆర్. తీవ్రనష్టాల్లోకి కూరుకుపోవడంతో ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. మల్టీప్లెక్స్ స్క్రీన్ల నిర్వహణలో టాప్గా ఉన్న PVR సినిమా సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోవటమే అందుకు కారణం అంటున్నారు.
జనవరి-మార్చి నాలుగో త్రైమాసికంలో పీవీఆర్- ఐనాక్స్కు దాదాపు రూ. 333 కోట్ల నష్టం వచ్చింది. గతేడాది ఇదే సమయంలోనూ వందకోట్లకుపైగా నష్టాలపాలైంది. థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం, అందుకు తగ్గట్టుగా ఆదాయం లేకపోవడం, బాలివుడ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడటంతో సంస్థ నష్టాలను చవిచూసింది. వీటికి తోడు ఓటీటీల ప్రభావం ఉండనే ఉంది. ఇక నష్టాల్లో ఉన్న పలు చోట్ల స్క్రీన్లను మూసివేయాలని ఈ సంస్థ నిర్ణయించింది.
అయితే, స్క్రీన్లు మూసివేసినా.. మల్టీప్లెక్స్లలోని మాల్స్ కొనసాగుతాయని పీవీఆర్-ఐనాక్స్ తెలిపింది. ఏడాది క్రితం PVR, ఐనాక్స్ లీజర్ సంస్థలు విలీనం అవ్వడం ద్వారా దేశంలోనే అతిపెద్ద మల్టిప్లెక్స్ సంస్థ ఆవతరించిన విషయం తెలిసిందే. పీవీఆర్-ఐనాక్స్ థియేటర్స్ పేరుతో భారత్, శ్రీలంకలో మొత్తం 1689 మల్టీప్లెక్స్ స్క్రీన్లు నడుపుతోంది ఈ సంస్థ. గత ఆర్థిక సంవత్సరంలో పీవీఆర్-ఐనాక్స్ కొత్తగా 168 స్క్రీన్లను ఓపెన్ చేశాయి కూడా.
ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మరో 150-175 స్క్రీన్లను ఓపెన్ చేయాలని భావించింది. వీటిలో 9 ఇప్పటికే ఓపెన్ చేయగా, 15 స్క్రీన్లు అనుమతి కోసం ఉన్నాయి. మరో 152 స్క్రీన్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ లోగా సంస్థ తీవ్ర నష్టాల్లోకి జారిపోయింది. ఇక థియేటర్లు మూసివేయడం తప్ప మరో మార్గం లేదని నిర్ణయానికొచ్చింది PVR సంస్థ.