
‘పుష్ప’ హిందీ వెర్షన్ 130 కోట్లకు పైగా బిజినెస్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ గొప్ప రికార్డు అందుకున్నందుకు బన్నీని అందరూ అభినందిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్స్ అని చెప్పుకునే ఎంతో మందికి ఇది చెంపపెట్టు లాంటిదని అక్కడ మీడియా అంటోంది. వారి స్ట్రెయిట్ సినిమాలు కేవలం 25 కోట్ల వసూళ్లు సాధించడానికి నానా తంటాలు పడుతున్న సమయంలో ఒక తెలుగు డబ్బింగ్ చిత్రం 130 కోట్ల కలెక్షన్లను రాబట్టగలగటం మామూలు విషయం కాదు.
బాలీవుడ్ సినిమాలను అక్కడి ప్రేక్షకులు ఎందుకు తిరస్కరిస్తున్నారో ‘పుష్ప’ నే ప్రత్యక్ష నిదర్శనం’ అని వరుసగా ట్వీట్లు పెడుతున్నారు. కాగా ఈ సినిమాను హిందీలో డిస్ట్రి బ్యూట్ చేసిన గోల్డ్ మైన్స్ టెలీఫిలిమ్స్ అధినేత మనీశ్ షాకు బన్నీ బంగారు గనిగా మారిపోయాడని అంటున్నారు. ఈ విషయమై మనీషా మీడియాతో మాట్లాడారు. ఆయన కొన్ని విషయాలు తనకు షాకింగ్ గా మారాయన్నారు. అసలు ఆయన ఏమన్నారో చూద్దాం.
'పుష్ప' హిందీ డిస్ట్రిబ్యూటర్ మనీష్ షా మాట్లాడుతూ...సౌత్ సినిమాలను హిందీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. దానికి తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్స్కు యూట్యూబ్లో వచ్చే వ్యూసే ఉదాహరణ. అయితే ఈ తెలుగు సినిమాలను డబ్బి్ంగ్ వర్షన్స్ రూపంలో థియేటర్లలోకి తీసుకెళ్లిన ఘనత మాత్రం మనీష్ షాకే దక్కుతుంది. దాదాపు 10 సంవత్సరాల పైనుండే ఆయన తెలుగు సినిమాల డబ్బింగ్ వర్షన్స్కు డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్నాడు. కంటెంట్కు భాషతో సంబంధం లేదు. ఆడియన్స్కు కథ నచ్చితే హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, భాష ఏంటి అన్ని విషయాలను పట్టించుకోరు అంటున్నారు మనీష్ షా.
తెలుగు సినిమా అయినా కూడా హిందీ డబ్బింగ్ వర్షన్తో టీవీలోని టీఆర్పీ విషయంలో రికార్డు సృష్టించిన సినిమా 'సరైనోడు' అని ఆయన పేర్కొన్నారు. అయిదేళ్ల పాటు ఈ రికార్డును ఎవరు చెరపలేకపోయారని ఆయన అన్నారు. అల్లు అర్జున్ తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్స్ ఎన్నో యూట్యూబ్లో కూడా రికార్డులు క్రియేట్ చేశాయి. 'పుష్ప' సినిమా హిందీలో 1600 స్క్రీన్స్లో విడుదల అయ్యింది. దీనికి మనీష్ షానే డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు.
విడుదలయ్యి ఏడో వారం అయినా కూడా ఇంకా 1000కి పైగా థియేటర్లలో పుష్ప హిందీ వర్షన్ కొనసాగడం విశేషం. పుష్ప ముందుగానే పెద్ద హిట్ అవుతుందని ఊహించామని మనీష్ షా అంటున్నారు. అల్లు అర్జున్ పెద్ద స్టార్ కాబట్టి ఇలా జరగడం పెద్ద విషయం కాదని ఆయన అన్నారు. కానీ ఓటీటీలో వచ్చినా కూడా ఇంకా థియేటర్లలో నడుస్తుందని మాత్రం ఊహించలేదని తెలిపారు మనీష్ షా. ఇది ఆయనకు ఇంకా షాకింగ్గానే ఉందని తెలిపారు. పైగా బాలీవుడ్ మేకర్స్.. సౌత్ సినిమాలను చూసి కొన్ని విషయాలు నేర్చుకోవాలని అన్నారు మనీష్ షా.