
ప్రభాస్ లిస్ట్ లో అన్నీ భారీ చిత్రాలే ఉన్నాయి. రాధే శ్యామ్, సలార్(Salaar), ఆదిపురుష్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె చిత్రాల బడ్జెట్ కలిపితే రూ. 2000 కోట్ల పైమాటే. ఆయన తరహాలో చిత్రాలు చేస్తున్న హీరో దేశంలోనే లేరు. అలాంటి ప్రభాస్ మారుతికి అవకాశం ఇచ్చారంటే నమ్మడం కష్టమే. దర్శకుడు మారుతి ఇప్పటి వరకు ఒక్క స్టార్ హీరోతో కూడా మూవీ చేయలేదు. నాని, శర్వానంద్, సాయి ధరమ్ తేజ్ వంటి టూటైర్ హీరోలతో ఆయన హిట్స్ కొట్టారు. కెరీర్ బిగినింగ్ లో మారుతి యూత్ ఫుల్ అడల్ట్ కామెడీ చిత్రాలు చేశారు.
చిన్నగా పంథా మార్చిన మారుతి (Maruthi)హెల్తీ కామెడీతో ఎంటర్టైనింగ్ చిత్రాలు చేయడం మొదలుపెట్టారు.మారుతి ప్రతిరోజూ పండగే తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సాయి ధరమ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిందీ చిత్రం. ఈ సినిమా విజయం తర్వాత స్టార్ హీరోల కోసం వేట సాగించారు. అయితే ఫలితం దక్కలేదు. అల్లు అర్జున్ ఛాన్స్ ఇస్తాడని చాలా ఆశలు పెట్టుకున్నారు. స్టార్ హీరోలు ఎవ్వరూ అవకాశం ఇవ్వకపోవడంతో యంగ్ హారో సంతోష్ శోభన్ మంచిరోజులు వచ్చాయి అనే చిత్రం చేశారు. అలాగే 3 రోజెస్ పేరుతో ఆహా కోసం ఓ మూవీ చేశారు.
ప్రస్తుతం మాస్ హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే ప్రభాస్ తో మూవీ చేయనున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం... మారుతి ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే మాస్ ఫ్యాన్సీ టైటిల్ రిజిస్టర్ చేయించారట. ఇక చిత్ర షూటింగ్ లో అధిక భాగం సెట్స్ లోనే పూర్తి చేస్తారట. మరొక న్యూస్ ఏమిటంటే... ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ఆయనతో రొమాన్స్ చేయనున్నారట.
అధికారిక సమాచారం లేకున్నా.. ప్రభాస్-మారుతీ చిత్రంపై క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ మార్చ్ 11న విడుదల కానుంది. ప్రభాస్ కంప్లీట్ రొమాంటిక్ ఫెలోగా ఈ మూవీలో కనిపించనున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా... రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ ఏడాది వరుసగా ప్రభాస్ నుండి చిత్రాలు విడుదల కానున్నాయి. ప్రశాంత్ నీల్ సలార్, ఓం రౌత్ ఆదిపురుష్ 2022లో విడుదల కానున్నాయి.