
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు పెద్ద వివాదం నెలకొంది. చాలా సినిమాల షూటింగ్లు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. సినీ వర్కర్లు(తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్)కి, ఫిల్మ్ ఛాంబర్కి మధ్య వేతనాల విషయంలో వివాదం నెలకొంది. 30శాతం వేతనాలు పెంచాలని సినీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుండగా, ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతలు అందుకు ఒప్పుకోవడం లేదు. ఫెడరేషన్ డిమాండ్ని ఛాంబర్ నో చెప్పడంతో షూటింగ్ల బంద్ కొనసాగుతుంది. 30శాతం వేతనాలు పెంచి ఇచ్చే నిర్మాతల సినిమాల షూటింగ్లకు మాత్రమే సినీ కార్మికులు హాజరు కావాలని ఫెడరేషన్ డిక్లేర్ చేసింది. దీంతో వివాదం నెలకొంది.
అయితే కొందరు నిర్మాతలు ముంబయి నుంచి సినీ కార్మికులను తెచ్చుకుని షూటింగ్లు జరుపుకుంటున్నారు. దీన్ని ఫెడరేషన్ కార్మికులు వ్యతిరేకించారు. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దదయ్యింది. కార్మికుల సమస్య తీవ్రంగా మారింది. దీన్ని నిర్మాతలు సీరియస్గా తీసుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె కి మద్దతుగా విధులకు హాజరు కానీ వారిని మినహాయించి, ఎవరైతే, జరుగుతున్న షూటింగ్ లు ఆపుతూ అంతరాయం కలిగిస్తున్నారో, అలాగే ఆ షూటింగ్ లకు హాజరు అవుతున్న సభ్యులను బెదిరిస్తూ, షూటింగ్ లకు రాకుండా అడ్డుకుంటున్నారో వారిని మాత్రం భవిష్యత్తులో జరిగే షూటింగ్ లకు తీసుకోకూడదని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది. పెద్ద రచ్చకు దారి తీస్తుంది. ఫెడరేషన్కి, నిర్మాతలకు మధ్య దూరాన్ని మరింత పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇప్పుడు కాస్త మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లింది. నిర్మాతలు అల్లు అరవింద్, సుప్రియ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్, సి కళ్యాణ్ వంటి పలువురు నిర్మాతలు మంగళవారం సాయంత్రం చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. సినీ కార్మికుల బంద్పై చిరంజీవితో చర్చించారు. సినీ వర్కర్ల విషయంలో వేతనాల పెంపు వివాదం, యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాలను చిరంజీవికి వివరించారు.
ఈ విషయాన్ని నిర్మాత సి కళ్యాణ్ మీడియాకి వివరించారు. చిరంజీవిని కలిసి పరిస్థితిని వివరించామని, కార్మికుల డిమాండ్లని, తమ సమస్యలను ఆయనకు తెలియజేశామని చిరుతో సమావేశం అనంతరం తెలిపారు సి కళ్యాణ్. దీనిపై చిరంజీవి విచారం వ్యక్తం చేసినట్టు, షూటింగ్లు బంద్ కావడం విచారకరమని, సినీ కార్మికుల సమస్యలు కూడా వినాలని చిరంజీవి తెలిపినట్టు నిర్మాత సి కళ్యాణ్ వెల్లడించారు. రెండు రోజులు వేచి చూద్దామని, అనంతరం తన అభిప్రాయాన్ని వెళ్లడిస్తానని చిరంజీవి చెప్పినట్టు సి కళ్యాణ్ వివరించారు. చిరంజీవి త్వరలో సినీ వర్కర్ నాయకులతోనూ భేటీ కానున్నారు. వారి వాదనలు కూడా విని ఈ సమస్యని పరిష్కరించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే చిన్న నిర్మాతల విషయంలోనే ఈ వేతనాల సమస్య వస్తుందని, వారితో చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటామని సి. కళ్యాణ్ చెప్పారు.
ఇదిలా ఉంటే సినీ కార్మికుల బంద్ని పట్టించుకోకుండా కొందరు నిర్మాతలు షూటింగ్ లు జరుపుతున్నారు. దాదాపు పది సినిమాల షూటింగ్లు చిత్రీకరణ జరుపుకుంటున్నాయని తెలుస్తోంది. దీంతో ఇది సరికొత్త చర్చకు తెరలేపుతుంది. షూటింగ్ జరుగుతున్న సినిమాల్లో స్థానిక కార్మికులు కూడా పాల్గొంటున్నారు. అయితే ఆయా నిర్మాతలు పెంచిన వేతనాలు ఇచ్చేందుకు రెడీ అయ్యారా? లేక నచ్చిన నిర్మాతల సినిమాల షూటింగ్లో సినీ కార్మికులు పాల్గొంటున్నారా? అనే చర్చ జరుగుతుంది. మరోవైపు ముంబయి నుంచి కార్మికులను తీసుకొచ్చి షూటింగ్లు చేస్తున్నారు కొందరు నిర్మాతలు. పవన్ కళ్యాణ్ `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ షూటింగ్ కూడా అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో అలానే జరుగుతుంది. దీంతో సినీ కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది.
మరోవైపు ప్రభాస్ హీరోగా నటిస్తున్న `ది రాజాసాబ్` చిత్ర షూటింగ్ కూడా జరుగుతుండగా, కొందరు కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంత ప్రాపర్టీ డ్యామేజ్ జరిగింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సినీ కార్మికులపై కేసు పెట్టారు. కార్మికుల ఇలా డామినేట్ చేయడం సరికాదని, ఇలానే వదిలేస్తే రేపు ఇంకా డిమాండ్ చేస్తారని ఆయన తెలిపారు. తన ప్రాపర్టీని డ్యామేజ్ చేశారని, వారిని నుంచి నష్టపరిహారం రాబడతానని, లీగల్గా పోరాడతానని తెలిపారు నిర్మాత విశ్వప్రసాద్.
కోర్ట్ నుంచి ఫిల్మ్ ఫెడరేషన్కి నోటీసులు పంపించారు నిర్మాత. దీనిపై సినీ కార్మికుల ఫెడరేషన్ సెక్రెటరీ అమ్మిరాజు స్పందించారు. పీపుల్స్ మీడియా నోటీస్కు సమాధానం ఇస్తామని, నిర్మాతలకు, పీపుల్స్ మీడియాకు మేం వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. గొడవపడే ఉద్దేశం కార్మికులకు లేదని, పీపుల్స్ మీడియాపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. మరి ఈ వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో, దీనికి ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో చూడాలి. అయితే ఇప్పటికే వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, ఇంకా పెంచితే ప్రొడక్షన్ భారం అవుతుందని నిర్మాతలు వాదిస్తుండటం గమనార్హం.