Dil Raju: నా థియేటర్స్ లో నా సినిమా వేసుకోవద్దా... నేను వేరే చోట థియేటర్స్ కోసం అడుక్కుంటున్నాను!

By Sambi ReddyFirst Published Dec 16, 2022, 10:47 AM IST
Highlights

2023 సంక్రాంతి సినిమాల విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. నిర్మాత దిల్ రాజు వారసుడు సినిమాకు పెద్ద ఎత్తున థియేటర్స్ బ్లాక్ చేసి పెట్టాడని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. 
 

2023 సంక్రాంతికి మూడు పెద్ద చిత్రాలు విడుదల చేస్తున్నారు. వీటిలో రెండు మైత్రి మూవీ మేకర్స్ వే. మరొక చిత్రం దిల్ రాజుది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడంతో పాటు స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. థియేటర్స్ ఆధీనంలో ఉంచుకొని పరిశ్రమను కంట్రోల్ చేస్తున్న దిల్ రాజుకు చెక్ పెట్టాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. అదే సమయంలో తన ఆధిపత్యానికి గండి కొట్టాలని చూస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ని కోలుకోలేని దెబ్బతీయాలనేది దిల్ రాజు వ్యూహం పన్నుతున్నారట. 

ఇక వారసుడు విడుదలపై కుట్ర పన్నారని దిల్ రాజు పరోక్షంగా ఆరోపిస్తున్నారు. మొత్తంగా టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక అనారోగ్యపూరిత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో దిల్ రాజు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితులపై క్లారిటీ ఇచ్చారు. ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు ఎదిగాడని కొందరు కుట్ర పన్నుతున్నారు. అయితే పరిశ్రమలో ఎవరూ ఎవరినీ తొక్కలేరని చెప్పాడు. 

వారసుడు చిత్ర విడుదల ఆపాలి అనుకుంటే నన్ను పిలిచి ఛాంబర్ లేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ మాట్లాడాలి. కానీ వారు నేరుగా మీడియాతో మాట్లాడతారు. ప్రజలకు సంబంధం లేని విషయాన్ని మీడియాలో పంచుకోవాల్సిన అవసరం లేదు, అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకు దాదాపు 70 థియేటర్స్ ఉన్నాయి. నా థియేటర్స్ లో నా సినిమా వేసుకుంటా.. అందులో తప్పేముంది అన్నారు. 

తమిళనాడులో 800 థియేటర్స్ ఉన్నాయి. విజయ్ అక్కడ అందరికంటే పెద్ద స్టార్. అజిత్ మూవీ కూడా విడుదల అవుతుంది. నాకు 400 థియేటర్స్ ఇస్తున్నారు. అజిత్ పెద్ద స్టార్ కాబట్టి కనీసం మరో 50 థియేటర్స్ ఇవ్వమని అడుక్కుంటున్నాను. మైత్రి మూవీ మేకర్స్ తో ఎలాంటి వివాదం లేదు. అన్ని చిత్రాలకు థియేటర్స్ దొరుకుతాయి. జనవరి ఫస్ట్ వీక్ లో చర్చించుకోవాల్సిన అంశాలు ఇవి. కానీ దిల్ రాజు ఏదో చేసేస్తున్నాడని ఒక పుకారు లేపి, గందరగోళం సృష్టిస్తున్నారని దిల్ రాజు తెలియజేశారు . 
 

click me!