
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ప్రతిష్టాత్మక మూవీ `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇవ్వబోతుంది యూనిట్. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ ప్రకటించారు. రేపు మంగళవారం ఉదయం(మార్చి1)న అప్డేట్ని ఇవ్వబోతున్నట్టు తెలిపారు.
మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఏడుగంటల సమయంలో ఈ చిత్రం నుంచి అప్డేట్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ఓ రకంగా మహాశివరాత్రి సందర్బంగా ప్రభాస్ ఫ్యాన్స్ కిది మంచి ట్రీట్ అవబోతుందని చెప్పొచ్చు. అయితే ఏం అప్డేట్ ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం నుంచి ఏదైనా గ్లింప్స్ ఇవ్వబోతున్నారా? లేక సినిమా రిలీజ్ డేట్ని ప్రకటిస్తారా? అనే ఊహాగానాలకు పని పెట్టారు నెటిజన్లు. దీంతో ఇప్పుడిది ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది.
అయితే ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదల కావాల్సి ఉంది. కానీ అమీర్ ఖాన్, నాగచైతన్య కలిసి నటించిన `లాల్ సింగ్ చద్దా` చిత్రాన్ని అదే డేట్కి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే `ఆదిపురుష్`తో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. `లాల్ సింగ్ చద్దా` కోసం `ఆదిపురుష్`ని వాయిదా వేశారు. కొత్త డేట్ని ఇంకా ప్రకటించలేదు. రేపు ఆ అప్డేట్ రాబోతుందని అంతా భావిస్తున్నారు.
అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి లుక్స్ రాలేదు. ఇందులో ప్రభాస్ గెటప్ ఎలా ఉంటుంది, రాముడిగా ఎలా ఉండబోతున్నారనేదానికోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి అప్డేట్ ఏదైనా వస్తుందా? ఆశగా ఎదురుచూస్తున్నారు.