నా భార్యను లాగుతారా, అదే జరిగితే మీ ఇంట్లో స్త్రీలపై నేనూ మాట్లాడుతా.. పవన్ కు పోసాని హెచ్చరిక

By Siva KodatiFirst Published Sep 28, 2021, 7:03 PM IST
Highlights

రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు పవన్‌కు మద్దతుగా వుంటే.. మరికొందరు మాత్రం సైలెంట్‌గా వున్నారు. కానీ పోసాని కృష్ణమురళీ మాత్రం.. రియాక్ట్ అయ్యారు

రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు పవన్‌కు మద్దతుగా వుంటే.. మరికొందరు మాత్రం సైలెంట్‌గా వున్నారు. కానీ పోసాని కృష్ణమురళీ మాత్రం.. రియాక్ట్ అయ్యారు. తన అభిమాన నాయకుడు జగన్‌ను పవన్ అనరాని మాటలు అన్నారంటూ మీడియా ముందుకు వచ్చారు. నిన్న పవన్‌పై పోసాని వ్యాఖ్యలు చేశారు. దీంతో పోసానిపై పవన్ అభిమానులు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కృష్ణమురళీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. 

పవన్ కల్యాణ్ పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారని, వారంతా సైకోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన ఫోన్‌కు వేలాది మెసేజీలు అందుతున్నాయని, బూతులు తిడుతున్నారని చెప్పారు. గ్యాప్ లేకుండా మెసేజీలు పంపిస్తున్నారని పోసాని అన్నారు. కుటుంబ సభ్యుల జోలికి వెళ్లొద్దంటూ పవన్ కల్యాణ్.. ప్రెస్ మీట్ పెట్టి.. తన అభిమానులకు పవన్ కల్యాణ్ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వకపోతే తానూ కుటుంబ సభ్యుల జోలికి వెళ్తానని అన్నారు.

పవన్ కల్యాణ్‌కు కూడా ఒక కుమార్తె ఉందని, రేప్పొద్దున ఎవరైనా ఆమెను ఏమైనా అంటే ఆయన బాధపడరా? అని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు. తాను బతికే ఉంటానని, పవన్ కల్యాణ్‌కు రక్త కన్నీరు తప్పదని జోస్యం చెప్పారు. నీ ఇంట్లో ఉండే వాళ్లే ఆడవాళ్లా? మా ఇంట్లో ఉండే వాళ్లు ఆడవాళ్లు కాదా? అని నిలదీశారు. తన భార్యను బజారుకు ఈడుస్తూ పవన్ కల్యాణ్ సైకో ఫ్యాన్స్ చేస్తోన్న మెసేజీలు వెంటనే ఆగకపోతే.. తాను కూడా పవన్ కల్యాణ్ ఇంట్లో ఆడవాళ్లను రోడ్డుకు ఈడ్చేలా తిడతానని పోసాని హెచ్చరించారు.

Also Read:వెయ్యి ముక్కలవుతావని కేసీఆర్.. పవన్‌ను తిట్టారు, అప్పుడు ఎక్కడున్నారు: పవన్ ఫ్యాన్స్‌పై పోసాని ఆగ్రహం

ఇదే సమయంలో పోసాని మాట్లాడుతున్న సమయంలో ఓ విలేకరి అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఆయన మీద కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన భార్యా, బిడ్డలను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బజారుకు ఈడ్చేలా వ్యాఖ్యలు చేస్తోన్న విషయాన్ని తాను బయటికి చెప్పుకోవడానికి వచ్చానని పోసాని కృష్ణ మురళి స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన మీద, తన కుటుంబ సభ్యుల మీద ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారో.. చెప్పుకోవడం వ్యక్తిగతం కాదని అన్నారు.

వైఎస్ జగన్ తనను రెండు చోట్లా ఓడగొట్టాడనే అక్కసు, ఆగ్రహం పవన్ కల్యాణ్‌కు ఉందని పోసాని ఎద్దేవా చేశారు. ఆ కడుపుమంటతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. రాజకీయాల్లో పరిణతి, పరిపక్వత అవసరం అని, అవి పవన్ కల్యాణ్ అనే సైకోలో అవి లేవని అన్నారు. సైకో ఫ్యాన్స్‌ను పెంచి పోషిస్తోన్న పవన్ కల్యాణ్.. అతి పెద్ద సైకో అంటూ ధ్వజమెత్తారు. చిరంజీవి ఏరోజైనా నోరు జారి మాట్లాడలేదని, ఆయన అభిమానులు కూడా అంతేనని పోసాని కృష్ణ మురళి అన్నారు.

click me!