
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో, కష్టాల్లో ఉన్న వారికి తనవంతు సాయం అందించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. పెద్ద మనసు చాటుకోవడంలో చిరంజీవి ఎవరూ సాటిరారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. తాజాగా చిరంజీవి ఓ ప్రముఖ నటుడికి సాయం చేసి అతడి ప్రాణాలు నిలబెట్టారు.
తమిళ నటుడు పొన్నాంబళం గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో భాదపడుతున్న సంగతి తెలిసిందే. పొన్నాంబళం తనకి ఆర్థిక సాయం అందించాలని కూడా గతంలో విజ్ఞప్తి చేశాడు. పొన్నాంబళంకి పలువురు ఆర్థిక సాయం అందించినప్పటికీ అది అతడి వైద్య ఖర్చులకు సరిపోలేదు. ప్రస్తుతం పొన్నాంబళం పూర్తిగా కోలుకుని నార్మల్ అయ్యారు.
ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గారివల్లే తనకు వైద్యం అందింది అని.. ఆయన చేసిన సాయాన్ని జీవితాంతం మరచిపోలేని అని పొన్నాంబళం అన్నారు. తన స్నేహితుడి ద్వారా పొన్నాంబళం చిరంజీవి ఫోన్ నంబర్ తీసుకున్నారు. 'అన్నయ్య నేను పొన్నాంబళం. నా ఆరోగ్యం బాగాలేదు.. వీలైన సాయం చేయండి' మెసేజ్ చేసి రిక్వస్ట్ చేశారట.
పది నిమిషాల తర్వాత అన్నయ్య నుంచి ఫోన్ వచ్చింది. హాయ్ పొన్నాంబళం.. ఏంటి నీ ఆరోగ్యం బాగాలేదా.. హైదరాబాద్ కి రాగలవా వైద్యం చేయిస్తాను అని అడిగారు. నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పాను. అయితే వెంటనే చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్ళు.. మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పారట.
నేను ఆసుపత్రికి వెళితే కనీసం నన్ను ఎంట్రీ ఫీజు కూడా అడగలేదు. మొత్తం వాళ్లే చూసుకుని వైద్యం చేశారు. వైద్యానికి రూ 45 లక్షలు ఖర్చు అయింది. అంతా చిరంజీవి అన్నయ్యే భరించారు అంటూ పొన్నాంబళం ఎమోషనల్ అయ్యారు. ఆ ఆసుపత్రి రాంచరణ్ గారి సతీమణి ఉపాసన గారిదే కావడంతో నన్ను ఇంకా బాగా చూసుకున్నారు అంటూ పొన్నాంబళం తెలిపారు.
చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు , ఘరానా మొగుడు, మెకానిక్ అల్లుడు, హిట్లర్ లాంటి చిత్రాల్లో పొన్నాంబళం నటించారు. 90వ దశకంలో క్రూయల్ గా కనిపించే విలన్స్ లో పొన్నాంబళం కూడా ఉండేవారు.