మత్తు మందు ఇచ్చి ..యాంకర్ పై అత్యాచారం

First Published May 11, 2018, 9:59 AM IST
Highlights


శ్రీరెడ్డి సహాయంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడు. మత్తు మందు కలిపిన జ్యూస్ తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి.. మళ్లీ మోసం చేశాడు. దీంతో.. బాధితురాలి నటి శ్రీరెడ్డి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ప్రకాశం జిల్లా పుల్లెలచెరువు మండలం మానేపల్లికి చెందిన శ్రీశాంత్‌రెడ్డి నగరంలోని ఇందిరానగర్‌కు వలసొచ్చి, సినీ కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది అక్టోబరులో ఓ మహిళా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, యాంకర్ పరిచయమవ్వగా... సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించాడు. 

డిసెంబరు 10న బోరబండలోని ఆమె ఇంటికి వెళ్లాడు. తనతో పాటు మత్తుమందు కలిపిన పళ్లరసాన్ని వెంట తీసుకెళ్లాడు. అది తాగిన సదరు మహిళ మత్తులోకి జారుకుంది. అనంతరం ఆమెపై శ్రీశాంత్‌రెడ్డి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగలేదు. ఆమె ఇంట్లోంచి 40 తులాల బంగారు అభరణాలు, రూ.5 లక్షల నగదు కాజేశాడు.

 స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె అతడిని కలిసి ఇదేంటని ప్రశ్నిస్తే... కట్నం కింద తీసుకున్నానని చెప్పాడు. పెళ్లి చేసుకోవాలని కోరగా, అందుకు మాత్రం అతడు అంగీకరించలేదు. దీంతో శ్రీశాంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలితో పాటు... సినీ ఆర్టిస్టులు శ్రీరెడ్డి, సోనారాథోడ్‌, రాగసృతి, సునితారెడ్డిలు గురువారం పోలీసు స్టేషన్ కి వచ్చారు. 

అప్పటికే ఆమెపై ఫిర్యాదివ్వడానికి శ్రీశాంత్‌రెడ్డి కూడా అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో శ్రీశాంత్‌రెడ్డిపై బాధితురాలు చెప్పుతో దాడి చేసింది. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా... మిగతా ఆర్టిస్టులు కొందరు నిందితునిపైకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నారు. 

click me!