
నందమూరి బాలకృష్ణ సోమవారం రోజు ఏప్రిల్ 28న రాష్ట్రపతి భవన్ లో పద్మ భూషణ్ అవార్డుని స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. దీనితో బాలయ్యకి అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా బాలయ్యకి కేంద్ర ప్రభత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. పద్మ అవార్డుల వేడుక తాజాగా రాష్ట్రపతి భవన్ లో వైభవంగా జరిగింది. బాలయ్య తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో వెళ్లి పద్మభూషణ్ అందుకున్నారు. బాలయ్య పద్మ భూషణ్ అందుకున్న తర్వాత జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
'హిందూపురం శాసన సభ్యులు, ప్రముఖ కథానాయకులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పద్మ భూషణ్ పురస్కారం స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో శ్రీ బాలకృష్ణ గారికి ప్రత్యేక స్థానం ఉంది. చారిత్రాత్మక, పౌరాణిక, జానపద పాత్రల్లో ఆయన శైలి ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రజాసేవలో, కళా సేవలో శ్రీ బాలకృష్ణ గారు మరిన్ని మైళ్ళు రాళ్లు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను' అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ 2లో నటిస్తున్నారు. అఖండ నుంచి సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ వరకు వరుసగా నాలుగు హిట్లు బాలయ్య అందుకున్నారు. హీరోగా దూసుకుపోతూనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. బుల్లితెరపై కూడా బాలయ్య తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరుచుకున్నారు. అన్ స్టాపబుల్ షోకి బాలయ్య హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.