పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ ఒక యోధుడిగా ‘వీరమల్లు’ పాత్రలో కనిపించనుండగా, ఈ కథ 17వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుంది. పవన్ కళ్యాణ్కు ఇది కొంత గ్యాప్ తర్వాత రాబోతున్న చిత్రం కావటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ బడ్జెట్ సినిమాను జూన్ 12 న రిలీజ్ చేయబోతున్నట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, డబ్బింగ్ తదితర కీలక ప్రక్రియలను చిత్ర యూనిట్ వేగంగా పూర్తిచేస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. త్వరలో మూడో పాటతో పాటు అధికారిక ట్రైలర్ను విడుదల చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ఆలస్యమైనా దర్శకుడు ఈ ప్రాజెక్టును నాణ్యత పరంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, తోట తరణి ప్రొడక్షన్ డిజైన్ చిత్రానికి ప్రధాన బలం కాబోతున్నాయి.
చిత్రంలో పవన్ కళ్యాణ్తో పాటు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తిగా ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, సీనియర్ నటులు సత్యరాజ్, జిష్షు సేన్గుప్తా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించగా, ఎ.ఎం. రత్నం సమర్పిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలకానున్న 'హరిహర వీరమల్లు' సినిమా, బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కావాలని మూవీ టీమ్ అంచనాలతో ఉన్నారు. పవన్ స్టార్ ఫ్యాన్స్ ఈసినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.