లైంగిక వేధింపుల ఆరోపణలు, కొందరు ప్రముఖులపై ఆరోపణలు, నిరసనల వంటి అంశాలతో చెలరేగిన వివాదంపై చర్చించేందుకు సినీ పెద్దలు మంగళవారం సమావేశమయ్యారు.
హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు, కొందరు ప్రముఖులపై ఆరోపణలు, నిరసనల వంటి అంశాలతో చెలరేగిన వివాదంపై చర్చించేందుకు సినీ పెద్దలు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 18 మంది హీరోలు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
చిరంజీవి చొరవ తీసుకుని అన్నపూర్ణ స్టూడియోలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. హీరోలు బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. సమావేశం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
టీవీ చానెల్లు సినిమాలపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని, వాటికి కంటెంట్ ఇవ్వకూడదని, ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, వాటిని ప్రోత్సహించకూడదని ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా టీవీ చానెళ్లను బ్యాన్ చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు.
శ్రీరెడ్డి వ్యవహారంపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మొదట్లోనే పిలిచి ఆమెతో మాట్లాడి ఉంటే వివాదం ఇంతగా ముదిరి ఉండేది కాదని కొంత మంది అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
మరో మూడు, నాలుగు రోజుల్లో మరోసారి సమావేశమై తగిన నిర్ణయాలు తీసుకోవాలని సమావేశం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం తీసుకున్న తర్వాత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ద్వారా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, అల్లు అర్జున్, రాంచరణ్, రామ్, నాని, సాయి ధరమ్ తేజ, వరణ్ తేజ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కెఎల్ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, జీవిత, రాజశేఖర్, మంచు లక్ష్మి, బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సమావేశానికి హాజరయ్యారు.