
బాహుబలి, బజ్రంగీ భాయిజాన్ వంటి చిత్రాల్ని రచించిన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ చాలా గ్యాప్ తర్వాత రచించి డైరెక్ట్ చేసిన సినిమా శ్రీవల్లి. రేపే ఈ సినిమా ఆడియెన్స్ ముందుకొస్తున్న తరుణంలో తాజాగా మీడియాతో మాట్లాడిన చిత్ర నిర్మాత సునీత ఓ ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు.
సైన్స్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా కావడంతో ఇందులో మొదటి 5 నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు అని అన్నారామె. అంతేకాకుండా ప్రముఖ దర్శకుడు, విజయేంద్ర ప్రసాద్ తనయుడు ఎస్ఎస్ రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చిన 5 నిమిషాల వీడియో కూడా అదేనట. సినిమాలో మిగతా కథాంశానికి కీలకం కానున్న ఆ 5 నిమిషాలు మిస్ అయితే సినిమాను ఎంజాయ్ చేయడం కష్టం అంటున్నారు యూనిట్ సభ్యులు.
శ్రీవల్లి అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ఆమెపై ఓ శాస్త్రవేత్త చేసిన ప్రయోగం వల్ల శ్రీవల్లికి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇంతకి ఆమెను అంతగా వేంటాడిన గత జన్మ రహస్యాలేమిటి? మనసును కొలవగలిగే వినూత్న ప్రయోగానికి శ్రీవల్లి ఎందుకు ఒప్పుకుంది? అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ చిత్ర కథ నడుస్తుంది. తెలుగు తెరపై ఇప్పటివరకు రానటువంటి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఇది. ప్రతిక్షణం మలుపులతో కొత్త అనుభూతినిస్తుంది.
ఈ సినిమా ఆరంభం నుంచి రాజమౌళి టీమ్ మాకెంతో సహాయసహకారాల్ని అందించింది. ప్రతి విషయంలో మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించింది. చాలా కొత్త కథ ఇది. తప్పకుండా అందరికి నచ్చుతుంది అని సుకుమార్ అభినందించారు. ఒక అమ్మాయిని సైంటిస్ట్గా చూపించడం కొత్తగా వుందని, తెలుగులో వినూత్న ప్రయోగాత్మక చిత్రమిదని నిజామాబాద్ ఎంపీ కవితగారు మా సినిమాను మెచ్చుకున్నారు. ఆమె మాటలు మా చిత్ర బృందానికి కొత్త ఉత్సాహానిచ్చాయి. ప్రీరిలీజ్ వేడుకకు రామ్చరణ్ అతిథిగా హాజరవడం గొప్ప అనుభూతినిచ్చింది. ఇలా చిత్ర పరిశ్రమలోని ఎందరో ప్రముఖులు మా చిత్రానికి స్వచ్ఛందంగా తమ ఆశీస్సులు అందించారని నిర్మాతలు సంతోషంగా వున్నారు.
మిస్ ఇండియా నేహా హింగే శ్రీవల్లి అనే న్యూరో సైంటిస్ట్ టైటిల్ రోల్ పోషించగా రజత్ మరో ప్రధాన పాత్రలో నటించాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు మంచి క్రేజ్ కనిపిస్తోంది.