
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు అనంతరం ఆయన సినిమా షూటింగ్ల్లో పాల్గొంటారని సమాచారం. దాని ప్రకారమే ఆయన నటించాల్సిన మూడు సినిమాల షూటింగ్లు ప్లాన్ చేసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవన్ గెలిస్తే ఓ లెక్క, ఓడిపోతే మరో లెక్క. ఏం జరిగినా, ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయాల్సిన దర్శక, నిర్మాతల్లో గుబులు లాంటి వాతావరణం ఉంది. ఏం జరగబోతుందో అనే ఉత్కంఠ అయితే అందరిలోనూ నెలకొంది.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు డిజప్పాయింట్ అయ్యే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆయన్నుంచి రావాల్సిన మూవీ ఈ ఏడాది రావడం లేదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాల్లో అత్యంత హైప్ ఉన్న మూవీ `ఓజీ`. ముంబయి మాఫియా ప్రధానంగా సాగే మూవీ ఇది. సుజీత్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. ఓ 15, 20రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ముందు ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 27న విడుదల అవుతుంది.
కానీ లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ ఈ ఏడాది రావడం లేదట. ఈ మూవీ బిజినెస్ కాలేదని అంటున్నారు. నిర్మాత పరంగా సమస్యలు, అలాగే పవన్ కూడా ఇప్పట్లో షూటింగ్లో పాల్గొంటాడా అనేది సస్పెన్స్ గా మారింది. ఇలా అనేక టెక్నీకల్ కారణాలతో ఈ మూవీ ఇప్పట్లో ఆడియెన్స్ ముందుకు తీసుకురావడం, ఈ ఏడాది రిలీజ్ చేయడం కష్టమే అంటున్నారు. అయితే ఈ సమాచారం ఆల్రెడీ ఇతర నిర్మాతలకు చేరిపోయిందట. అందుకే `ఓజీ` రావాల్సిన డేట్కి వేరే సినిమాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే దుల్కర్ సల్మాన్ చేస్తున్న `లక్కీ భాస్కర్` రిలీజ్ డేట్ని సేమ్ డేట్కి ప్రకటించారు. ఇదే పవన్ `ఓజీ` రావడం లేదనే విషయాన్ని కన్ఫమ్ చేస్తుంది.
మరోవైపు సెప్టెంబర్ 27ని ఎన్టీఆర్ కూడా టార్గెట్ చేస్తున్నారు. పవన్ స్థానంలో తాను రావాలనుకుంటున్నాడట. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దీన్ని దసరా కానుకగా అక్టోబర్ 10 న విడుదల చేయాలని డేట్ని ప్రకటించారు. అయితే పవన్ `ఓజీ` తప్పుకుంటే అదే డేట్కి ఎన్టీఆర్ `దేవర`ని తీసుకురావాలనుకుంటున్నారట. దీనిపై కసరత్తు నడుస్తుందని, మరో వారం, పది రోజుల్లో క్లారిటీ రానుందని తెలుస్తుంది. మొత్తంగా ఈ వార్తలు చూస్తుంటే పవన్ ఈ ఏడాది రావడం లేదని అంటున్నారు. ఇది నిజంగానే పవర్ స్టార్ అభిమానులను నిరాశ పరిచే వార్త అనే చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే మరో సర్ప్రైజ్ తీసుకురాబోతున్నారు. `ఓజీ` స్థానంలో `హరిహర వీరమల్లు`ని తీసుకురావాలని అనుకుంటున్నారట. పవన్ ఎన్నికల ఫలితాల అనంతరం `ఓజీ` షూటింగ్లో కాకుండా `హరిహర వీరమల్లు` షూటింగ్లో పాల్గొంటాడట. ఆ మూవీని శరవేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా టీమ్ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం లొకేషన్లకి సంబంధించిన రెక్కీ నడుస్తుందని, త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామని టీమ్ వెల్లడించింది. మొదట ఈ మూవీని పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారట. మరి ఇది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. క్రిష్ స్థానంలో జ్యోతికృష్ణ దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నారు. క్రిష్ పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. ఏఎం రత్నం ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న విసయం తెలిసిందే. పవన్ నుంచి రాబోతున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం.