ఆ సెంటిమెంట్ ‘జైలవకుశ’తో రిపీట్ అవుతుందా?

First Published Sep 12, 2017, 2:25 PM IST
Highlights
  • తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న తారక్
  • ఎన్టీఆర్ సరసన రాశీ, నివేదా
  • దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు ‘జైలవకుశ’

ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘జై లవ కుశ’. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్లు.. ట్రైలర్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.  ఇందులో తారక్.. తన నట విశ్వరూపాన్ని చూపించేశాడన్న విషయం కేవలం ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. సినిమా ఎప్పుడు విడుదలౌతుందా అని  ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఎదురు చూస్తున్నారు.

 

అంతేకాదు ట్రైలర్ విడుదలైన 24గంటల్లో దాదాపు కోటి మంది దానిని వీక్షించారు. బాహుబలి తర్వాత ఇన్ని వ్యూస్ ఏ సినిమా ట్రైలర్ కీ రాలేదు. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ చర్చ జరుగుతోంది. ఈ సినిమాకి ఫ్యామిలీ సెంటిమెంటు కలిసివస్తుందని భావిస్తున్నారు. తమ కుటుంబ సభ్యుల నిర్మాణ సారథ్యంలో ఆయా హీరోలు నటించిన చిత్రాలు విజయవంతం కావడంతో.. ఈ సినిమాకి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు.

 

సినిమా నటులకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. ఏదైనా సినిమా ఒక తేదీన విడుదలై విజయం సాధిస్తే.. అదే రోజున వారి తర్వాత సినిమా విడుదల చేయాలని భావిస్తుంటారు. ఇలాంటి సెంటిమెంట్లు సినీరంగంలో  చాలానే ఉన్నాయి. వారి నమ్మకం ప్రకారం.. అవి వర్కౌట్ కూడా అయిన సందర్భాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అదేవిధంగా జైలవకుశకు ఈ సెంటిమెంట్ కలిసొస్తదన్న ప్రచారం జరుగుతోంది.

 

మెగాస్టార్ చిరంజీవి దశాబ్ధం తర్వాత వెండి తెరపై ఘనంగా పునరాగమనం చేసిన చిత్రం ‘ఖైదీ నెం.150’. ఈ చిత్రాన్ని ఆయన కుమారుడు రామ్ చరణ్ నిర్మించారు. ఇక మన భల్లాలదేవుడు రానా.. నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ఇటీవలే విడుదలై విజయం సాధించింది. దీనికి తేజ దర్శకత్వం వహించగా.. ఆయన తండ్రి సురేష్ తమ సొంత ప్రొడక్షన్ పై నిర్మించారు. జైలవకుశ సినిమా కూడా తారక్ కుటుంబ సొంత బ్యానర్ పై ఆయన అన్న కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందన్నది అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. మరి ఆ సెంటిమెంట్ వర్క్ అవుతుందో లేదా దసరా వరకు ఆగి చూడాల్సిందే. ఈ  సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. రాశి, నివేదాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

click me!