
‘భీమ్లానాయక్’ రిలీజ్ కు రెడీ అయ్యింది. అయితే టిక్కెట్ల విషయంలో ఆంధ్రాలో పరిస్దితి ఏమీ మార్పులేదు. టిక్కెట్ రేట్ల జీవో.. ఐదు షోలు వేసుకునే అవకాశాన్ని ఇస్తామని స్వయంగా సీఎం చెప్పినా ఇంత వరకూ విడుదల చెయ్యలేదు.. భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కంటే ముందు జీవోరాదని చాలా మంది ఎక్సపెక్ట్ చేసిన్నట్లుగానే పరిస్థితులు ఉన్నాయి. అలాగే జీవో వస్తుందని .. పెరిగిన టిక్కెట్ రేట్లకు అమ్ముకోవచ్చని ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్కు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది.
ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్లోని థియేటర్లకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా బెనిఫిట్ షో, అదనపు షోలు వేయరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని, టికెట్ రేట్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. రూల్స్ ఉల్లంఘించిన వారిపై సినిమాటోగ్రఫీ చట్టం 1952 ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో వెల్లడించారు. ఈమేరకు అన్ని జిల్లాల్లో తహసీల్దార్లు వారి పరిధిలోని థియేటర్లకు నోటీసులు జారీ చేశారు.
అదే సమయంలో తెలంగాణలో ఐదో ఆటకు అనుమతి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ‘భీమ్లానాయక్’ ఐదో ఆటకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి థియేటర్లోనూ ఐదో ఆటను ప్రదర్శించుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయం పట్ల పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
‘వకీల్సాబ్’ తర్వాత పవన్ నటిస్తున్న చిత్రం కావడంతో ఎక్సపెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఇందులో రానా మరో కీలక పాత్ర పోషించారు. సాగర్ కె.చంద్ర ‘భీమ్లా నాయక్’ను తెరకెక్కించారు. తమన్ సంగీత దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. త్రివిక్రమ్ సంభాషణలు అందించారు.