
సుశాంత్ సింగ్ రాజ్పుత్తో బాలీవుడ్లో నెపోటిజం చర్చనీయాంశంగా మారింది. కొత్త వారిని రానివ్వడం లేదనే ప్రచారం జరిగింది. కంగనా రనౌత్ వంటి వారు ఈ అంశాన్ని పెద్ద చర్చకు తెరలేపారు. ఈ నేపథ్యంలో తెలుగులో వారసత్వం, బంధుప్రీతి పై ఏకంగా సినిమానే వస్తుంది. `నెపోటిజం` పేరుతో ఓ చిత్రం రూపొందుతుంది. `ఒకవేళ హీరోలు.. హీరోల కుటుంబంలో పుట్టకపోయి ఉంటే.. హీరోలు అయ్యేవారా?` అని కాప్షన్తో ఈ సినిమాని రూపొందుతుండటం చర్చనీయాంశంగా మారడంతోపాటు ఆసక్తిని రేకెత్తిస్తుంది.
విపుల్ దర్శకత్వంలో వై.అనిల్ కుమార్, కె.శ్రీనివాసరావు పాపిన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కొర్రపాటి వెంకటరమణ సమర్పణలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వెంకీ, వాసిం, వెంకట్ పొడి శెట్టి, జగదీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర లిరికల్ వీడియో సాంగ్ని దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన షాకింగ్ కామెంట్ చేశారు. `టాలీవుడ్లో నెపోటిజం ఉన్న మాట వాస్తవమే అని, చాలా మంది హీరోల కొడుకులు, డైరెక్టర్స్ కొడుకులు హీరోలుగా ట్రై చేశారు. ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయారని, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా వచ్చి తమ టాలెంట్తో సూపర్ స్టార్ అయిన వాళ్ళు కూడా ఉన్నారన్నారు.
మన ప్రతిభని ప్రదర్శించుకునేందుకు దానికి పట్టుదల కావాలని, సిన్సియర్గా కష్టపడాలన్నారు. ఈ కాన్సెప్ట్ తోనే `నెపోటిజం` సినిమాని తీశారని భరద్వాజ తెలిపారు. ఇతరులను తిట్టకుండా సొంతంగా కష్టపడితే టాప్ పొజిషియన్కి వస్తామనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందన్నారు. ఇమిటేట్ చేస్తే ఎక్కువ కాలం మనుగడ సాధించలేమని, సొంత ప్రతిభతోనే, సొంత స్టయిల్ని క్రియేట్ చేసుకోవాలన్నారు. `పుట్టగానే ఎవ్వరూ స్టార్ కారు. స్టార్ అవ్వడానికి ఎవరైనా కఠోర శ్రమ చేయాలనేది ఇందులో చూపిస్తున్నామని, సినిమాని దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నామ`ని దర్శకుడు విపుల్ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్బాబు, పవన్ కళ్యాణ్ల గెటప్లో చిత్ర నటులను పెట్టి పోస్టర్ విడుదల చేయడం ఆకట్టుకుంటుంది.