
నటసింహం నందమూరి బాలకృష్ణ 102వ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా సి. కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ ముగిసింది.
అరివుమణి-అంబుమణిల సారధ్యంలో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ బాలయ్యపై చిత్రీకరించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్లో నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా, హరిప్రియ, ప్రకాష్రాజ్, బ్రహ్మానందం, మురళీ మోహన్, జేపీ, ఎల్బీ శ్రీరామ్లతో పాటు ఇతర ప్రధాన తారాగణం కూడా పాలుపంచుకొంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. "అక్టోబర్ 5న మొదలైన క్లైమాక్స్ ఎపిసోడ్ అక్టోబర్ 15 వరకూ నిరాటంకంగా జరిగింది. అరివుమణి-అంబుమణిలు అత్యంత నేర్పుతో సహజంగా ఉండేలా ఈ పోరాట సన్నివేశాలని డిజైన్ చేశారు. మూసాపేట్ లోని కంటైనర్ యార్డ్ లో ఈ కీలకమైన ఎపిసోడ్ ను షూట్ చేశాం. ఇప్పటికే నయనతార, నాటాషా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో హరిప్రియ మరో కథానాయికగా కనిపించనుంది`` అన్నారు.