
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రముఖ సంగీత దర్శకుడు దశి అలియాజ్ శివకుమార్(50) అక్కడికక్కడే మృతి చెందారు. క్షణాల్లో అంతా జరిగిపోయిందని ప్రమాదం జరిగిన చోట స్థానికులు చెబుతున్నారు. శివకుమార్ తమిళం, మలయాళీ భాషల్లో భాషల్లో అనేక చిత్రాలకు సంగీతం అందించారు.
శివకుమార్ తన స్నేహితులతో కలసి కేరళ నుంచి చెన్నైకి కారులో వస్తుండగా ఈ ఊహకందని ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాధమికంగా పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. శివకుమార్ సొంత ఊరు సాలిగ్రామం. తన స్నేహితులు ఆడియన్, రియల్టర్ నాగరాజు, పుదుప్పెట్ కి చెందిన దర్శకుడు మూవేందన్ అంతా కలసి చెన్నైకి బయలు దేరారు.
తిరువూరు జిల్లా అవినాశి టౌన్ సమీపంలోకి రాగానే కారు ముందు టైర్ అకస్మాత్తుగా పేలింది. దీనితో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ ని ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో సంగీత దర్శకుడు శివకుమార్, అతడి స్నేహితుడు ఆడియన్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మిగిలిన వారికి తీవ్రంగా గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
శివకుమార్ ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు మాత్రమే కాదు అనేక అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. దంధార అనే మలయాళీ చిత్రానికి గాను శివకుమార్ ఉత్తమ సంగీత దర్శకుడిగా కేరళ ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు. ఆఫ్ స్క్రీన్ లో ఆయన ఎన్నో ఆధ్యాత్మిక పాటలకు సంగీతం అందించారు. ఒత్త వీడు, సతనయి పయనం, అడవార్ లాటి చిత్రాలు శివకుమార్ కి మంచి గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు శివకుమార్ ఇలా ఘోర ప్రమాదంలో మరణించడంతో స్నేహితులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకున్నారు. ఈ వార్త తమిళ, మలయాళీ సినీ ప్రముఖుల్ని దిగ్బ్రాంతికి గురి చేసింది.