ఈ స్దాయి బజ్ ఉన్న చిత్రం రిలీజ్ రోజున సాధారణంగా ఎవరూ తమ సినిమా రిలీజ్ లు పెట్టుకోరు. కానీ కొన్ని సినిమాలు రంగంలోకి దూకుతున్నాయి. అవేంటో చూద్దాం.
రణ్బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘యానిమల్’ (Animal) రేపు ప్రపంచం వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది.‘కబీర్ సింగ్’ తర్వాత బాలీవుడ్లో సందీప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రమిదే. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ఇది విడుదల కానుంది. తండ్రీతనయుల సెంటిమెంట్తో అలరించడానికి సిద్ధమైంది. ఒక వ్యక్తి తన కుటుంబం కోసం ఎంత దూరం వెళ్తాడు..? అనే అంశాన్ని ఈసినిమాలో చూపించనున్నారు. రష్మిక హీరోయిన్ గా నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తికపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పోస్టర్లతోనే అంచనాలను కలిగించిన చిత్రబృందం ట్రైలర్తో వాటిని రెట్టింపు చేసింది. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా ఇందులో రణ్బీర్ పాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ స్దాయి బజ్ ఉన్న చిత్రం రిలీజ్ రోజున సాధారణంగా ఎవరూ తమ సినిమా రిలీజ్ లు పెట్టుకోరు. కానీ కొన్ని సినిమాలు రంగంలోకి దూకుతున్నాయి. అవేంటో చూద్దాం.
సుడిగాలి సుధీర్ నటించిన ‘కాలింగ్ సహస్ర’ కూడా రిలీజ్ అవుతోంది. సుధీర్ ఈసారి క్రైమ్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. ట్రైలర్ లో కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు కాబట్టి దాని ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందనే దాని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. ఓపెనింగ్స్ రావడమే డౌట్ గా ఉందంటున్నారు.
మరో ప్రక్క ‘అథర్వ’ అనే మరో థ్రిల్లర్ కూడా బరిలోకి దూకుతోంది. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి జంటగా నటించగా మహేష్ రెడ్డి దర్శకత్వం వహించారు. టీమ్ తమ చిత్రంపై బాగా నమ్మకంగా ఉంది. ఇక ‘ఉపేంద్ర గాడి అడ్డా’ అనే మరో చిన్న చిత్రం ఇదే రోజు రిలీజ్ అవుతోంది. యానిమల్ సినిమా హిందీ లో తీసినా తెలుగు డబ్బింగ్ కు ఓ రేంజిలో క్రేజ్ ఉంది. ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా బజ్ పెరిగిపోవడంతో ఫస్ట్ డే షాకింగ్ ఫిగర్లు నమోదు అవుతాయంటున్నారు.
ఈ క్రమంలో నయనతార ‘అన్నపూరణి’ తెలుగు వెర్షన్ డిసెంబర్ 1 రిలీజ్ ఆపారు. కేవలం తమిళంకు మాత్రమే పరిమితం చేశారు. బాలీవుడ్ లో మరో సినిమా రిలీజ్ చేయటానికి నిర్మాతలు సాహసం చేయలేదు. అయితే విక్కీ కౌశల్ ‘సామ్ బహదూర్’ మాత్రం తగ్గేదేలే అని వస్తోంది.
ఇక ఓ స్టార్ హీరో సినిమాకు ‘యానిమల్’ అనే టైటిల్ పెట్టడం వెనక కారణం చెప్పుకొచ్చారు. సందీప్ వంగా మాట్లాడుతూ... సాధారణంగా మనకి చదువు, తెలివితేటలు వచ్చాయి కాబట్టి మనిషి అని పేరు పెట్టుకున్నామని.. నిజానికి మనిషి ఒక సోషల్ యానిమల్ అని సందీప్ అన్నారు. మనుషులకు ఐక్యూ ఉంది కాబట్టి కమ్యూనికేషన్ పెరిగి, ఫుడ్ చెయిన్లో మొదటిగా ఉంటూ వస్త్రాలు ధరించామని.. ఐక్యూ అనేది లేకపోతే మనం కూడా యానిమలే కదా అనేది తన వ్యక్తిగత భావన అని చెప్పారు. చిన్నప్పుడు సోషల్ స్టడీస్ చదువుకున్నప్పటి నుంచీ అలాగే అనిపించేదన్నారు. ‘నేను ఆలోచించింది ఏంటంటే.. యానిమల్కు ఐక్యూ ఉండదు. తన ప్రవృత్తితో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో హీరో పాత్ర కూడా ప్రవృత్తితో వ్యవహరిస్తూ ఉంటుంది. అలాంటి పాత్రకు సంబంధించిన కథకు యానిమల్ అనే టైటిల్ బాగుంటుందని ఆ పేరు పెట్టాను’ అని సందీ వివరించారు.
ఇక ఈ చిత్రం కాన్సెప్టు గురించి చెప్తూ...‘యానిమల్’ను తండ్రీకొడుకుల ప్రేమకథగా అనుకోవచ్చని.. ప్రాథమిక కథ అదేనని చెప్పారు. ఒక వ్యక్తి కుటుంబం కోసం ఎంత దూరం వెళ్తాడనేది కథలోని సారాంశమన్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రకు ‘యానిమల్’లో రణ్బీర్ కపూర్ పాత్రకు ఉన్న పోలిక ఒక్కటేనని.. అది నిజాయితీ అని సందీప్ చెప్పారు. అర్జున్ రెడ్డికి కోపం వస్తే కంట్రోల్ చేయలేమని.. కానీ ‘యానిమల్’లో హీరో పాత్రకు మాత్రం సామాన్యంగా అందరికీ ఉండే కోపమే ఉంటుందన్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ రెండూ క్యారెక్టర్ బేస్డ్ సినిమాలేనని తెలిపారు. అయితే కథ, పాత్ర చిత్రీకరణ పూర్తిగా భిన్నంగా ఉంటుందన్నారు.
అలాగే సినిమాలో రష్మిక పోషించిన పాత్ర చాలా ముఖ్యమైనదని.. సినిమా ఆద్యంతం ఉంటుందని సందీప్ చెప్పారు. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నారు. హీరోని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా అర్థం చేసుకున్న భార్య పాత్రలో రష్మిక కనిపిస్తారన్నారు. హీరో తర్వాత అంత ప్రాధాన్యత రష్మిక, అనిల్ కపూర్ పోషించిన పాత్రలకే ఉందని చెప్పారు. తండ్రీకొడుకుల బంధంతో పాటు మంచి ప్రేమకథ కూడా ఉందన్నారు.
ఇప్పటి వరకు ఇలాంటి సబ్జెక్ట్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై చూడని విధంగా యానిమల్ ఉంటుందట. దాంతో యానిమల్ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీ పక్కా రివెంజ్ స్టొరీ అని తెలుస్తుంది. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు. టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.