
తన విలక్షణ నటనతో దశాబ్దాలుగా మోహన్ బాబు తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్నారు. నేడు మోహన్ బాబు తన 71వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. దీనితో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి మోహన్ బాబుకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తన పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో మోహన్ బాబు అనేక విషయాలు పంచుకున్నారు. తాను చిత్ర పరిశ్రమలోకి రాకముందు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్ననో వివరించారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా మోహన్ బాబు తన కెరీర్ స్టార్ట్ చేశారు. నెమ్మదిగా విలన్ వేషాలు వేస్తూ ఆ తర్వాత క్రేజీ హీరోగా మారారు.
ఇక చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాల గురించి తరచుగా వార్తలు వస్తూనే ఉంటాయి. దీనిపై మోహన్ బాబు స్పందిస్తూ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాకు చిరంజీవికి విభేదాలు ఉన్నాయని తరచుగా వార్తలు రాస్తుంటారు. మేము ఎన్నో సార్లు కలుస్తుంటాం.. మాట్లాడుకుంటాం. భార్య భర్తల్లాగా పోట్లాడుకుని మళ్ళీ కలసిపోతుంటాం అని సరదా వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు, చిరంజీవి ఎన్నో చిత్రాల్లో కలసి నటించిన సంగతి తెలిసిందే. గతంలో మా అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా మంచు, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు స్పష్టంగా బయట పడ్డాయి.
అలాగే తన పెద్ద కుమారుడు మంచు విష్ణు నటించిన జిన్నా చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిన్నా చాలా మంచి చిత్రం. కానీ ఎందుకు ఫెయిల్ అయిందో అర్థం కావడం లేదు అని అన్నారు. తాను తరచుగా ఎమోషనల్ అవుతుంటానని కూడా మోహన్ బాబు అన్నారు. ఎన్టీఆర్, కృష్ణ లాంటి ఆత్మీయులు మరణించినప్పుడు నా కంట కన్నీళ్లు వచ్చాయి. ఇటీవల నా కొడుకు మంచు మనోజ్ పెళ్లి జరిగినప్పుడు కూడా ఎమోషనల్ అయ్యాయని మోహన్ బాబు అన్నారు.