
లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ ఇండియన్ సినిమాని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. దిలీప్ మరణం ఇండియన్ సినిమాకి తీరని నష్టం అంటూ సినీ,రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. అమితాబ్, అక్షయ్, అజయ్ దేవగన్, చిరంజీవి, మహేష్, వెంకటేష్, ఎన్టీఆర్, రవితేజ, మోహన్లాల్ వంటి అనేక మంది సినీ తారలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్బాబు దిలీప్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దిలీప్ మరణం భారతీయ సినిమాకి కోలుకోలేని నష్టమన్నారు. నటుడిగా, ఆ తర్వాత స్టార్గా వెలిగిన దిలీప్ సాబ్ మరణం నన్ను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. సినిమాలో ఓ శకం ముగిసింది. అనేక సందర్భాల్లో ఆయన్ని కలిసే అవకాశం రావడం అదృష్టంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నాం. లెజెండ్ ఆత్మ శాంతి చేకూరాలి` అని తెలిపారు.
గత కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న దిలీప్ కుమార్ చికిత్స పొందుతూ హిందుజా ఆసుపత్రిలో బుధవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరగా ప్లూరల్ యాస్పిరేషన్ (ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించడం) ప్రొసీజర్ నిర్వహించారు. కానీ మళ్లీ తీవ్ర అస్వస్థతకు లోనవడంతో ప్రాణలు విడిచారు. గతేడాది దిలీప్ కుమార్ సోదరులు అస్లాంఖాన్, ఇషాన్ ఖాన్లు కరోనాతో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే దిలీప్ కూడా కన్నుమూయడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.