
బాహుబలి 2 ప్రీ రిలీజ్ వేడుక నేపథ్యంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను టాలీవుడ్ లో కొంత మంది బుర్ర తక్కువ దర్శకులతో కూడా పని చేయాల్సి వచ్చిందని ఘాటుగా వ్యాఖ్యానించిన కీరవాణి రాజమౌళి లాంటి దర్శకులు పుట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ఇంకా పలు సంచలనాలకు తెరలేపిన కీరవాణి వ్యాఖ్యల పై ఓ లుక్కేద్దాం.
‘‘ఇకపై నేను సంగీత దర్శకుడిగా కొనసాగితే... నాకు నేనే బాస్! దర్శకుడితో సహా నా బాణీలకు ఎవరూ బాస్గా ఉండరు. ఈ నిర్ణయం నా బాధ్యతను పెంచుతుంది. నా అభిప్రాయంలో ‘సంగీత దర్శకుడు తన ఆధీనంలో ఉండడు అనే ఐడియాను ఏ దర్శకుడూ ఇష్టపడడు. తెలుగు చిత్ర పరిశ్రమలో బుర్ర తక్కువ (బ్రెయిన్లెస్) దర్శకులు ఎక్కువ. అలాంటోళ్లు ఉన్నంత వరకూ నేను స్వరకర్తగా కొనసాగే అవకాశాలు తక్కువ’’ అని ఘాటుగా స్పందించారు ఎం.ఎం. కీరవాణి.
బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన రాజమౌళి కుటుంబ సభ్యులపై ప్రశంసల వర్షం కురిపించిన కీరవాణి, ఆయన పనిచేసిన దర్శకుల్లో కొందరిని మూగ మనుషులు, చెవిటోళ్లు అంటూ విమర్శలు చేశారు. ‘‘నా క్రమశిక్షణ, నా సతీమణి (శ్రీవల్లి) స్ట్రాంగ్ సపోర్ట్ వల్ల చిత్ర పరిశ్రమలో గౌరవం సంపాదించుకున్నా. తనే నా శివగామి. తను కూడా నేను రిటైర్ కాకూడదని కోరుకుంటోంది. కానీ, నేను నిర్ణయించుకున్నా’’ అని ఆదివారం మధ్యాహ్నం ట్విట్టర్లో రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన, తర్వాత నిర్ణయం మార్చుకున్నారు. ‘‘నా స్వీయ నిబంధనల మేరకు స్వరకర్తగా నా ప్రయాణం సాగుతుంది’’ అని సాయంత్రం 5.30 గంటలకు ప్రకటించారు.
తకు ముందు ట్విట్టర్లో కీరవాణి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. నా ప్రయాణం మౌళి (సంగీత దర్శకుడిగా కీరవాణి తొలి చిత్రం ‘మనసు మమత’ దర్శకుడు) గారితో మొదలైంది. 27 ఏళ్ల తర్వాత ఈ రోజు నేనిక్కడ రాజమౌళితో ఉన్నాను. ఈ ప్రయాణంలో ఎలాంటి చీకూ చింతలు లేవు. కేవలం పాఠాలు మాత్రమే నేర్చుకున్నాను. దేవుడు నన్ను కీర్తి ప్రతిష్ఠలు, పరాజయాలు... రెండిటితో ఆశీర్వదించాడన్నారు.
నేనెక్కువగా బుర్ర తక్కువ దర్శకులతోనే పనిచేశా. వాళ్లు నా మాటలు వినేవారు కాదు. రాజమౌళికి నేను బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి కారణం అతను నా మాట వింటాడు. దర్శకులు నేను ఓ సంగీత దర్శకుణ్ణి మాత్రమే అనుకుంటారు. మంచి సలహా ఇచ్చినా తీసుకోరు. కథ వినేటప్పుడే నేను చేసిన చాలా చిత్రాలు ఫ్లాప్ అవుతాయని ఊహించా. కానీ, ఆ చిత్రదర్శకులు చెవిటోళ్లు. ఆ చెవిటితనం వల్ల మంచి బాణీలకు హాని కలగదు. కానీ, మంచి సలహా ఇచ్చినప్పుడు స్వీకరించలేని చెవిటితనం దర్శకుడికీ, చిత్రానికీ, నాకూ హాని చేస్తుంది. నా శ్రేయోభిలాషుల కోరిక మేరకు నేను సంగీత దర్శకుడిగా కొనసాగితే... చెవిటి, మూగ దర్శకులతో ప్రయాణించాలను కోవడం లేదు. ఎందుకంటే... ఓ స్వరకర్తగా నేను ఎప్పుడూ గర్వపడలేదు. నాలోని రచయితను చూసి గర్వపడుతుంటానన్నారు.
నేను రాజమౌళితో ఉన్నంతవరకూ అతన్నెవరూ చేరుకోలేరు. రాజమౌళికి పని పట్ల భక్తి, ప్రేమ ఉన్నంత వరకూ అతని స్టాండర్డ్స్ను ఎవరూ చేరుకోలేరు. ఇది వంద శాతం నిజం. ఇది నా వేదవాక్కు. రాజమౌళి తర్వాత ఎస్.ఎస్. కాంచి (కీరవాణి తమ్ముడు)పై ఆశలు ఉన్నాయి. అతని అభిప్రాయాలతో నావి వంద శాతం కలుస్తాయి. మా నాన్నగారు (శివశక్తి దత్తా) బహు ముఖ ప్రజ్ఞాశాలి. గొప్ప ఆర్టిస్ట్.. గొప్ప సంస్కృత రచయిత. ఆయన కుమారుడిగా పుట్టినందుకు గర్విస్తున్నా. కానీ, ఆయన తీసిన ‘చంద్రహాస్’ సినిమా నాకు నచ్చలేదన్నారు కీరవాణి.
ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కీరవాణి చురకలు వేశారు. ‘‘రాముగారు ‘క్షణక్షణం’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు మాత్రమే చేయమని నాకు సలహా ఇచ్చారు. నేనెప్పుడూ ఆయన మాట వినలేదు. మాది పెద్ద కుటుంబం కావడంతో, నాకున్న కుటుంబ బాధ్యతల వల్ల నా తలుపు తట్టిన ప్రతి అవకాశాన్నీ అంగీకరించా. ‘చీప్ ప్రొడక్షన్స్తో పని చెయ్యొద్దు’ అని నాకిచ్చిన సలహాను వర్మ తర్వాత పాటించలేదు. చాలా ఫ్లాప్ సినిమాలు తీసిన తర్వాత కూడా వర్మ అత్యంత మేథావి దర్శకుడిగానే మిగులుతాడు. ‘జాము రాతిరి..’ పాట ఎప్పటికీ ఎవర్గ్రీనే’’ అన్నారు కీరవాణి.
దర్శకుడు రాథవేంద్ర రావు తన గురువని చెప్పిన కీరవాణి తెలుగు సాహిత్యం అంతమొందుతోందని అభిప్రాయ పడ్డారు. వేటూరిగారి మరణం, ‘సిరివెన్నెల’ అనారోగ్యం కారణంగా తెలుగు సాహిత్యం (తెలుగు పాట) అంపశయ్యపై ఉందన్నారు కీరవాణి. ఇలా పలు ఆసక్తికర వ్యాఖ్యలతో కీరవాణి న్యూస్ మేకర్ ఆఫ్ ది డేగా మారారు.