
టాలీవుడ్ స్వీటీగా పేరుతెచ్చుకున్న అనుష్క.. ఇటీవల సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆ గ్యాప్ అనంతరం `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్రంతో రాబోతుంది. ఇందులో `జాతిరత్నం` నవీన్ పొలిశెట్టి హీరోగా నటించబోతున్నారు. `జాతిరత్నాలు` తర్వాత నవీన్ పొలిశెట్టి చేస్తున్న సినిమా ఇది. దీంతో మూవీపై మంచి క్రేజ్, బజ్ నెలకొంది. అనుష్క వంటి సీనియర్ బ్యూటీతో, కుర్ర హీరో నవీన్ జోడీ కట్టడం ఆశ్చర్యంగా ఉంది. అదే సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్లు, పోస్టర్లు, టీజర్లు ఆకట్టుకున్నాయి. మంచి కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇందులో నవీన్ స్టాండప్ కమెడియన్గా, అనుష్క చెఫ్గా కనిపించబోతున్నారు. ఈ ఇద్దరి మధ్య రొమాన్స్, కామెడీ హైలైట్గా ఉండబోతుందని టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్రానికి మహేష్బాబు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ డేట్పై సస్పెన్స్ నెలకొంది. మొదట ఆగస్ట్ 18న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అనూహ్యంగా రిలీజ్ డేట్ని మార్చారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే కారణంగా రిలీజ్ వాయిదా వేశారు. తాజాగా రిలీజ్ డేట్ని ప్రకటించారు. సెప్టెంబర్ 7న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. శ్రీకృష్ణ జన్మష్టమి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు. ఈ మేరకు కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో నవీన్, అనుష్క ఇద్దరు రోడ్డుపై ముచ్చటిస్తూ వస్తున్నారు. కొత్త లుక్ చాలా ప్లజెంట్గా ఉంది.