
మెగాస్టార్ చిరంజీవి తనని అవమాన పరిచిన గరికపాటికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. సున్నితంగా చెబుతూనే అదిరిపోయే సెటైర్లు వేశారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దసరా పండుగ నెక్ట్స్ డే హర్యానా గవర్నర్ దత్తాత్రేయ హైదరాబాద్లో `అలాయ్ బలాయ్` కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి అవధాని గరికపాటి నరసింహారావు, మెగాస్టార్ చిరంజీవి అతిథులుగా పాల్గొన్నారు. వేదికపై మహిళలు చాలా మంది వచ్చి చిరంజీవితో ఫోటోలు దిగుతున్నారు. ఓ వైపు ఆ ఫోటో సెషన్ జరుగుతుంది.
మరోవైపు అప్పుడే గరికపాటి మాట్లాడాలని సభ నిర్వహకులు ఆయనకు మైక్ ఇచ్చారు. స్టేజ్పై చిరంజీవి ఫోటో సెషన్ కోలాహలం కొనసాగుతుంది. అది గరికపాటికి ఇబ్బంది కలిగించింది. తన స్పీచ్ కంటే చిరంజీవి వైపే అందరి దృష్టి ఉంది. దీంతో ఆపుకోలేక `చిరంజీవిగారు మీరు ఫోటో సెషన్ ఆపితే నేను మాట్లాడతా` అంటూ అవమానకరంగా పదేపదే అన్నారు గరికపాటి. అక్కడ ఉన్న వారు ఆ విషయాన్ని చిరంజీవికి చేరవేయడంతో ఆయన ఫోటో సెషన్ ముగించుకుని వచ్చి గరికపాటి పక్కనే కూర్చున్నారు. అయితే గరికపాటి వ్యాఖ్యలను చిరంజీవి వినలేదు.
కానీ ఆ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. మెగా అభిమానులు గరికపాటిని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. విమర్శలు గుప్పిస్తూ ఆడుకున్నారు. ఈ విసయంలో నాగబాబు ఇన్వాల్వ్ కావడం, ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. కానీ ఏ రోజు దీనిపై చిరంజీవి స్పందించలేదు. `గాడ్ ఫాదర్` ఈవెంట్లో కెమెరామెన్ చోటా కే నాయుడు, దర్శకుడు బాబీ లాంటి వారు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడారు.
ఇన్నాళ్లకు చిరు దీనిపై స్పందించారు. తనదైన స్టయిల్లో సెటైర్లు వేయడం విశేషం. తాజాగా ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు రాసిన `శూన్యం నుంచి శిఖరాగ్రాలకు` పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. చిరంజీవిపై రాసిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయనేగెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మహిళలతో మరోసారి ఫోటో సెషన్నిర్వహించారు. ఈ సందర్భంగా `ఇక్కడ ఆయన లేడు కదా` అంటూ వ్యాఖ్యానించడం విశేషం. దీంతో సభ మొత్తం నవ్వులతో హోరెత్తింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.