
సినిమాలను చూసి జనం చెడిపోతారా..క్రైమ్ లోకి దిగుతారా అనే ప్రశ్నలు చాలా కాలంగా అందరినీ వేధిస్తున్నాయి. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని క్రైమ్ కేసులలో తాము ..ఫలానా సినిమా చూసి ఇన్సైర్ అయ్యి హత్య చేసాము లేదా రేప్ చేసాము,దొంగతనం చేసాము అని చెప్తూంటారు. సినిమా వాళ్లు అలాంటివన్నీ నిరాధారమైననవి అనికొట్టిపారేస్తూంటారు. అయితే ఇప్పుడు వెబ్ సీరిస్ లు చూసి కూడా హత్యలు జరిగే సంస్కృతి మొదలైంది. తాజాగా జరిగిన ఓ క్రైమ్ లో దొరికిన నిందితులు తాము ఫలానా వెబ్ సీరిస్ చూసి హత్య చేసామని చెప్పటం దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. వివరాల్లోకి వెళితే...
ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ పట్టణంలోని బ్రహ్మపురి ప్రాంతంలో 70 ఏళ్ల ధన్ కుమార్ జైన్.. 65 ఏళ్ల అంజు జైన్ లు నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం వేళలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఈ పెద్ద వాళ్లపై బెదిరింపులకు దిగారు. ఈ సందర్భంగా ఘర్షణ చోటు చేసుకోగా.. దుండగులు పిస్టల్ తో ఆ ఇద్దరిని కాల్చి చంపేశారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం.. నగదును దోచుకెళ్లారు. పట్టపగలుచోటు చేసుకున్న ఈ డబుల్ మర్డర్ స్థానికంగా పెను సంచలనంగా మారింది.
దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు 48 గంటల గడిచేసరికి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో బయిటపడిన అంశం ఏమంటే.. ఈ దారుణ నేరానికి పాల్పడిన వారిలో ఒకరు ఎల్ఎల్ బీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కావటం గమనార్హం.ఈజీ మనీకి అలవాటు పడిన వారు.. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ దొంగతనానికి తాను ‘అసుర్’ వెబ్ సిరీస్ చూసి ప్రేరణ పొందానని అన్నాడు.
అలాగే.. పోలీసులకు చిక్కకుండా ఎలా తిప్పించుకోవాలో యూట్యూబ్లో వీడియోస్ చూశానన్నాడు. తమ గుర్తింపు దొరక్కుండా ఉండేలా.. చేతికి గ్లౌజులు, మాస్క్లు, హెల్మెట్ని ఉపయోగించామని చెప్పాడు. బైక్ నంబర్ ప్లేట్ను సైతం మార్చామన్నాడు. సీసీటీవీ కెమెరాలు లేని మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు ఆ నిందితులు తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి తాము బంగారు, వెండి ఆభరణాలతో పాటు తుపాకీ, మోటార్ సైకిల్, బట్టలు, హెల్మెట్లు, షూలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.