
మహానటి సావిత్రి జీవితమే కథగా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం "మహానటి". అశ్విని దత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంకా దత్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ ప్రస్తుతం సెట్స్ పై ఉందన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ సావిత్రిగా నటిస్తుండగా సినిమాలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ నటిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మంచు వారమ్మాయి కూడా నటించే అవకాశం ఉందట. మంచు వారమ్మాయి అనగానే మంచు లక్ష్మి అనుకుంటే.. మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే.
ఈసారి మంచు లక్ష్మి కూతురు తెరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది మంచు లక్ష్మి. మహానటిలో సావిత్రి చిన్ననాటి పాత్రలో మంచు లక్ష్మి గారాలపట్టి, సరొగేట్ బేబీ విద్యా నిర్వాణను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. మంచు లక్ష్మి ఆసక్తి కారణంగానే విద్యా నిర్వాణను మహానటిగా చూపించబోతున్నారట.
నటిగా తాను చేయలేని పాత్రలను తన కూతురితో చేయించాలని ఉవ్విళ్లూరుతోంది మంచు లక్ష్మి. అందుకే మహానటి లాంటి ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లో ఆమెను భాగం చేస్తుంది. తాత నట వారసత్వంతో ఆ చిన్నారి కూడా తన రోల్ అద్భుతంగా చేయడం ఖాయమని అంటున్నారు. ఇక మహానటి సినిమా విషయానికొస్తే సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
సినిమాలో ఆడియెన్స్ ఊహించని సర్ ప్రైజెస్ ఎన్నో ఉంటాయట. సావిత్రి బయోపిక్ లో ఎన్.టి.ఆర్, ఏయన్నార్ లు లేకపోతే ఎలా.. ఎన్.టి.ఆర్ గా జూనియర్ ఎన్.టి.ఆర్, ఏయన్నార్ గా నాగ చైతన్యను చేయించాలని చూస్తున్నారట. ఏయన్నార్ గా చైతు ఓకే చెప్పినా ఎన్.టి.ఆర్ గా తారక్ కాస్త వెనుకడుగేస్తున్నాడట. అశ్వనిదత్ మాత్రం కచ్చితంగా ఎన్.టి.ఆర్ తో ఈ పాత్ర చేయించాలని చూస్తున్నారట. మరి తారక్ ను ఎలా ఒప్పిస్తారో చూడాలి.