
హీరో నితిన్(Nithiin) కెరీర్ ఇప్పటికీ ఒడిదుడుకులతో సాగుతుంది. `భీష్మ` చిత్రంతో హిట్ కొట్టిన ఆయన `చెక్`, `రంగ్దే` చిత్రాలతో బోల్తా కొట్టారు. ఇటీవల `మ్యాస్ట్రో` చిత్రంతో ఫర్వాలేదనిపించారు. తాజాగా మరో వినూత్న ప్రయోగం చేస్తున్నారు. `మాచర్ల నియోజకవర్గం`(Macherla Niyojakavargam) అనే చిత్రంలో నటిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం సాగబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. సినిమా ఫస్ట్ లుక్ వచ్చే డేట్ని అనౌన్స్ చేసింది యూనిట్.
ఈనెల 26న `ఫస్ట్ ఛార్జ్` పేరుతో ఫస్ట్ లుక్ని విడుదల చేయబోతున్నట్టు తెలిపింది. శనివారం ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఈ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇందులో నితిన్ పాత్రని కూడా రివీల్ చేసింది. ఈ చిత్రంలో నితిన్ ఎన్. సిద్ధార్థ్ రెడ్డిగా కనిపించబోతున్నారు. అంతేకాదు ఆయన ఐఏఎస్ అని, గుంటూరు జిల్లా కలెక్టర్గా కనిపించనున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది. దీనికి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడు.
శ్రేష్ట్ మూవీస్ పతాకంపై రాజ్కుమార్ ఆకేళ్ల సమర్పణలో ఎన్ సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ సైతం భాగమవుతుంది. ఇందులో యంగ్ సెన్సేషనల్ బ్యూటీ కృతి శెట్టి కథానాయికగా నటిస్తుంది. కేథరిన్ థ్రెస్సా మరో హీరోయిన్గా ఆడిపాడబోతుంది. రెగ్యూలర్ సినిమాలతో పరాజయాలు చవి చూసిన నితిన్ కాస్త ట్రెండ్ మార్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే `మాచర్ల నియోజకవర్గం` వంటి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారని టాక్. మరి ఈ చిత్రం నితిన్ కెరీర్ని మలుపుతిప్పుతుందా? హీరోగా నెక్ట్స్ లెవల్నిస్తుందా? అనేది చూడాలి.