
ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.పి. వెంకటేష్ (70) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
1955 మార్చి 5న తమిళనాడులో పుట్టిన వెంకటేష్, 1981లో సంగీత దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన..ఆ తర్వాత తంబి కన్నంతానం దర్శకత్వంలో వచ్చిన మోహన్లాల్ చిత్రం 'రాజావింటే మకన్'తో మలయాళంలో సంగీత దర్శకుడిగా అడుగుపెట్టారు.మలయాళంలో ఎన్నో హిట్ పాటలకు ఆయన స్వరకర్త. ఇంద్రజాలం, పైతృకం, తుడర్కథ, వాత్సల్యం, జానీవాకర్, కిలుక్కం, హిట్లర్, సోపానం, కాబూలీవాలా, మిన్నారం, స్ఫటికం లాంటి ఎన్నో సినిమాల్లో సంగీత ప్రియులు ఎప్పటికీ గుర్తుంచుకునే కొన్ని పాటలను ఎస్.పి. వెంకటేష్ అందించారు.
అప్పు, మహాయానం, దేవాసురం లాంటి చిత్రాలకు ఆయన చేసిన నేపథ్య సంగీతం చాలా ప్రసిద్ధి చెందింది. 1985-2000 మధ్య కాలంలో మలయాళ సినిమాలో ఎన్నో హిట్ పాటలను ఎస్.పి. వెంకటేష్ స్వరపరిచారు. మలయాళంతో పాటు తమిళ, తెలుగు చిత్రాలకు కూడా సంగీతం అందించారు.
మలయాళంలో ఇప్పటివరకు 150 చిత్రాలకు స్వరాలు సమకూర్చిన ఎస్.పి. వెంకటేష్, తన కెరీర్లో తమిళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో దాదాపు 500 పాటలకు సంగీతం అందించారు. తంబి కన్నంతానం సినిమాలకు సంగీత దర్శకుడిగా ఎక్కువగా పనిచేశారు. గిరీష్ పుత్తన్చేరి ఎస్.పి. వెంకటేష్ కోసం ఎక్కువసార్లు పాటలు రాశారు. ఎస్.పి. వెంకటేష్ స్వరపరిచిన పాటలను ఎక్కువగా స్టార్ సింగర్ చిత్ర పాడేవారు.
వెంకటేష్ తండ్రి పళని ఒక మాండొలిన్ వాద్యకారుడు. తండ్రి దగ్గర శిష్యరికం చేసి, మూడేళ్ల వయసు నుంచే వెంకటేష్ మాండొలిన్ వాయించడం మొదలుపెట్టారు. తర్వాత గిటార్, ఇతర సంగీత వాయిద్యాలు నేర్చుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో రవీంద్రన్, ఎ.టి. ఉమ్మర్ లాంటి వారికి సంగీత సహాయకుడిగా పనిచేశారు. ఇక ఇదు ముదివిల్లై సినిమా కోసం ఒకే రోజులో తొమ్మిది పాటలు కంపోజ్ చేసిన ఘనత వెంకటేష్ కే సాధ్యం అయ్యింది. ఎస్.పి. వెంకటేష్ మరణ వార్త తెలిసి సినీ పెద్దలు సంతాపం తెలుపుతున్నారు.