#KrishnamRaju: కనక మామిడి ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు.. అక్కడే ఎందుకంటే..

By Surya PrakashFirst Published Sep 12, 2022, 7:55 AM IST
Highlights

దాదాపుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కృష్ణంరాజు 50 సంవత్సరాలు పైనే కావస్తోంది. ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక రెబల్ స్టార్ గా తన ఇమేజ్ ను సైతం పదిలం చేసుకున్నారు. 

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కృష్ణంరాజుగారు చివరి శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు ఇక లేరన్న వార్త అభిమానులను కలచివేసింది.  చివరి చూపు కోసం ప్రజలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నము అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.  

ఈ క్రమంలో మధ్యాహ్నం 1 గంటకు చేవెళ్ల, మొయినాబాద్ దగ్గర లోని కనక మామిడి ఫామ్ హౌస్ లో జరుగుతాయి.ఇంటినుండి ఉదయం 11:30 గంటలకు ఆయన పార్థివదేహం బయలుదేరుతుంది.  కృష్ణం రాజు గారి అంతిమ యాత్రలో… పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

ఇక ప్రత్యేకంగా అక్కడే ఎందుకు అంత్యక్రియలు జరపబోతున్నారు అంటే..అది ఆయన సొంత ఫామ్ హౌస్. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఐదేళ్ల కిందట కొనుగోలు చేసిన కృష్ణంరాజు గారు అక్కడ నివసించేందుకు ఓ ఇంటిని నిర్మిస్తున్నారు. అది పూర్తికాక ముందే అసువులు బాశారు. 

సీనియర్ నటుడిగా, రాజకీయవేత్తగా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కృష్ణంరాజు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్న  ఉదయం 3:25 గంటలకు ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక ప్రభాస్ అభిమానుల సైతం తీవ్రంగా తమ బాధను వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ తండ్రి సూర్యం రాజు మరణించడంతో ఆ ఇంటికి పెద్ద దిక్కుగా మారారు కృష్ణంరాజు. ఇక ప్రస్తుతం ఆ ఇంటికి పెద్దదిక్కు లేకుండా పోయిందని పలువురు తమ బాధను తెలియజేస్తున్నారు.

click me!