
ఇప్పుడు `ఆర్ఆర్ఆర్` మూవీ కంటే `నాటు నాటు` మేనియాలో సాగుతుంది. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది. ఈ పాటకి డాన్సు చేసిన వీడియో క్లిప్పులే నెట్టింట బాగా దర్శనమిస్తున్నారు. దేశాలు దాటి, ఖండాలు దాటుకుని వెళ్తుంది. క్రేజ్కి కాదేని అనర్హం అన్నట్టుగా మారిపోయింది. ఎంతో మంది సెలబ్రిటీలు `నాటు నాటు` పాటకి స్టెప్పులేశారు. ఇప్పుడు ఇది ఆస్కార్ బరిలో ఉండటంతో మరింతగా పాపులారిటీని పొందింది.
తాజాగా ఈ `నాటు నాటు` పాటకి కొరియన్ ప్రభుత్వ అధికారులు డాన్సులు వేయడం విశేషం. ఇండియాలోని కొరియన్ ఎంబసీ అంబాసిడర్తోపాటు వారి స్టాఫ్ మెంబర్స్ కలిసి ఈ పాటకి డాన్సు చేశారు. అంతేకాదు, దీన్ని ఓ వీడియో రూపంలో చిత్రీకరించారు. పర్ఫెక్ట్ మ్యాచింగ్తో కొరియన్ ఎంబసీ(ఇండియా) అధికారులు ఈ డాన్సులు చేయడం విశేషం. ఇంకా చెప్పాలంటే వాళ్ల డాన్స్ కిర్రాక్గా ఉంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కొరియన్ ఎంబసీ ఇండియా అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ వీడియోని పంచుకుంది.
ఇది వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా `ఆర్ఆర్ఆర్` హీరో రామ్చరణ్ సైతం ఈ వీడియోని షేర్ చేశారు. కొరియన్ ఎంబసీ ట్వీట్ని షేర్ చేస్తూ, అత్యుత్తమ నృత్య కదలికలు, నాటు నాటు పట్ల ఉన్న ప్రేమకు ధన్యవాదాలు` అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది మరింత వైరల్గా మారుతూ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది.
రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్`లోని సాంగ్ `నాటు నాటు` అనే విషయం తెలిసిందే. రామ్చరణ్, ఎన్టీఆర్ కలిసి ఇందులో డాన్సు చేశారు. అది సినిమాకే హైలైట్గా నిలిచింది. ఇప్పుడు ప్రపంచానికి ఆకట్టుకుంటుంది. అలరిస్తుంది. ఇక ఈ సినిమాలో అలియాభట్, ఒలివియా మోర్రీస్ హీరోయిన్లుగా నటించగా, అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించారు. గతేడాది మార్చి 25న ఈ చిత్రం విడుదలైంది. సుమారు రూ12వందల కోట్లు వసూలు చేసింది. అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఇప్పుడు `నాటు నాటు` సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ బరిలో నిలిచింది.
దీనికోసం రామ్చరణ్, రాజమౌళి, ఇతర టీమ్ సభ్యులు అమెరికాలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రామ్చరణ్ అక్కడ తన జోరు కొనసాగిస్తున్నారు. వరుసగా మీడియా ఇంటర్వ్యూలకు హజరవుతున్నారు. ఆ మధ్య `జీఎంఏ` మీడియాతో చిట్చాట్ చేశారు. ఇప్పుడు `కేటీఎల్ఏ 5` అనే మీడియాతో ముచ్చటించారు. తాజాగా ఆ సంస్థ ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్చరణ్తో దిగిన ఫోటోలను పంచుకుంది.