ఎన్టీఆర్ సలహాతో గ్యాప్ తీసుకుని మరీ మార్పు, చేర్పులు జరుపుతూనే ఉన్నారని వినపడింది. మొత్తానికి అద్బుతమైన అవుట్ ఫుట్ వచ్చాకే సినిమా లాంచ్ పెట్టారు ఎన్టీఆర్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ‘ఎన్టీఆర్ 30’ ఈ రోజు లాంచ్ అయ్యింది. ఈ సినిమాపై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మొన్నామధ్య కొరటాలతో ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. వాటిన్నటికి ఈ చిత్రం లాంచ్ చెక్ చెప్పినట్లు అయ్యింది. ఇక స్క్రిప్ట్ విషయంలో చాలా కసరత్తు చేసారని, ఎన్టీఆర్ సలహాతో గ్యాప్ తీసుకుని మరీ మార్పు, చేర్పులు జరుపుతూనే ఉన్నారని వినపడింది. మొత్తానికి అద్బుతమైన అవుట్ ఫుట్ వచ్చాకే సినిమా లాంచ్ పెట్టారు ఎన్టీఆర్.
ఎన్.టి.ఆర్.30 సినిమా ప్రారంభోత్సవం ఈ రోజు అంటే గురువారంనాడు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కొరటాల శివ, జాన్వీకపూర్, ప్రకాశ్రాజ్, శ్రీకాంత్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత కల్యాణ్ రామ్ తదితరులు సందడి చేశారు. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువసుధ ఆర్ట్స్ బేనర్లో ఈ సినిమా రూపొందుతోంది. కళ్యాణ్ రామ్ నిర్మాత. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడారు. సినిమాపై మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడిన మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరింత నమ్మకాన్ని కలిగించాయి.
కొరటాల మాట్లాడుతూ..‘‘జనతా గ్యారేజ్’ తర్వాత నా సోదరుడు, ఈ జనరేషన్లో ఉన్న గొప్ప నటుల్లో ఒకరైన ఎన్టీఆర్తో కలిసి మరోసారి వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. అందరూ మర్చిపోయిన ఓ తీర ప్రాంత బ్యాక్డ్రాప్లో దీన్ని రూపొందిస్తున్నాం. ఈ కథలో మనుషుల కంటే ఎక్కువగా మృగాలు లాంటి మనుషులు ఉంటారు. భయం అంటే ఏమిటో వాళ్లకు తెలియదు. దేవుడంటే భయం లేదు. చావు అంటే భయం లేదు.
కానీ.. వాళ్లకు ఒకే ఒక్కటంటే భయం. ఆ భయమేంటో మీకు తెలిసే ఉంటుంది. ఇదే ఈ సినిమా బ్యాక్డ్రాప్. భయం ఉండాలి. భయం అవసరం. భయపెట్టడానికి ప్రధాన పాత్ర ఏ స్థాయికి వెళ్తుందనేది.. ఒక ఎమోషనల్ రైడ్. దీన్ని భారీ స్థాయిలో తీసుకువస్తున్నాం. నా కెరీర్లో ఇది బెస్ట్ అవుతుందని అందరికీ మాటిస్తున్నా. ఈ కథ చెప్పిన వెంటనే.. ‘‘ఫైర్తో రాశారు సర్’’ అని అనిరుధ్ అన్నాడు. ఇలాంటి టీమ్తో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని కొరటాల శివ వివరించారు.