మహానటి కి చివరి రోజు.. ఉక్కపెట్టి ఏడ్చిన కీర్తి

First Published Mar 22, 2018, 6:38 PM IST
Highlights
  • మహానటి సినిమా షూటింగ్ కి చివరి రోజు
  • చివరి రోజు కంటతడిపెట్టిన కీర్తి సురేష్
  • మే9న విడుదల కానున్న మహానటి

అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. కీర్తి సురేష్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్-స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ పూర్తయింది. బుధవారం ఆఖరి సన్నివేశాలు చిత్రీకరించి సెట్‌లో గుమ్మడికాయ కొట్టేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. షూటింగ్ పూర్తచేసుకున్న సందర్భంగా నిర్మాత ప్రియాంక దత్ మీడియాతో మాట్లాడారు.

 

‘మహానటి’ లాంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వపడుతున్నానని ప్రియాంక అన్నారు. తమ టెక్నికల్ టీం ఎంతో నేర్పుతో క్రియేట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఎరా ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేయడమే కాక అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుందని చెప్పారు. ‘ఏ విషయంలోనూ రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించాం. కీర్తి సురేష్, సమంత, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, షాలిని పాండే, మాళవిక నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ వంటి వారితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని వెల్లడించారు.

 

అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించిన నాగచైతన్యకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ప్రియాంక అన్నారు. ‘మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్ మాకెంతో సపోర్ట్‌గా నిలబడ్డారు. వారితో కలిసి పనిచేసిన ప్రతి నిమిషం మాకు అపురూపమైనది. ఆఖరి రోజున ఆఖరి సన్నివేశం చిత్రీకరణ పూర్తయిన తర్వాత గుమ్మడికాయ పూజలో సావిత్రిగారి పటం వద్ద ప్రతిమ వెలిగిస్తున్న తరుణంలో కీర్తి సురేష్ కన్నీరు పెట్టుకుంది. మే 9న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభూతిని మిగుల్చుతుంది’ అని ప్రియాంక వివరించారు.

 

click me!