
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలన్న ఉద్యమం ఊపందుకుంటోంది. ఎన్ని పోరాటాలు చేసినా, నిండు పార్లమెంట్ లో ఎంపీలు ఉద్యమం చేసినా కేంద్ర సర్కారు మనసు కరగలేదు. హడావుడిగా ఏదో చేస్తారనుకుంటే... హోదా ఇవ్వలేమంటూ తుస్సుమనిపించింది కేంద్రం. దీనికి రాష్ట్ర సర్కారు కూడా నిలదీసే పరిస్థితి లేకపోవడంతో హోదా మరుగున పడిందని అంతా అనుకున్నారు. కానీ హోదా ఉద్యమం ఆంధ్రుల గుండెల్లో రగులుతూనే ఉంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం మళ్లీ ఊపందుకుంటోంది. జనవరి 26న విపక్షాల పిలుపుమేరకు హోదాకు మద్దతుగా అనూహ్య స్పందన లభిస్తోంది.
ఇప్పుడు టాలీవుడ్ సైతం హోదా కోసం పోరు బాట పట్టింది. తమిళులు ఏ విధంగా కలిసిగట్టుగా పోరాడి జల్లికట్టు ఆర్డినెన్స్ సాధించారో అదే తరహాలో తెలుగు వారంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగు సినీ హీరోలు కూడా 'మేము సైతం' అంటూ ఇందుకోసం ముందుకొస్తున్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్తో పాటు మరో హీరో సందీప్ కిషన్ సైతం ఈ ఉద్యమానికి మద్దతిచ్చారు.
సందీప్ అయితే తాను ప్రత్యక్షంగా ఇందులో భాగస్వామిని అవుతానని చెప్పాడు. జనవరి 26వ తేదీన విశాఖపట్నంలో జరిగే మౌన నిరసన ప్రదర్శనలో తాను స్వయంగా పాల్గొంటానని, బాధ్యతాయుతమైన పౌరుడిగా రాష్ట్రానికి తనకు చేతనైనంత చేస్తానని చెప్పాడు. యువత అంతా తనతో కలిసి రావాలని కోరాడు. ఇక ఇప్పటికైనా మనమంతా ఒక్కటై రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, అది మన హక్కు, వాళ్లు హామీ ఇచ్చిన విషయమని సాయి ధరమ్ తేజ్ చెప్పాడు. తెలుగు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం ఏం చేసినా దానికి మద్దతిస్తానని వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. ఏపీ ప్రత్యేక హోదాకు తన మద్దతు ఉంటుందన్నాడు.