హీరోయిన్ ని బురిడీ కొట్టించి నకిలీ కరోనా టీకా ఇచ్చిన కేటుగాడు... ఆమెకు అస్వస్థత!

By team teluguFirst Published Jun 27, 2021, 7:48 AM IST
Highlights

కరోనా వైరస్ టీకా కార్యక్రమం పేరుతో హీరోయిన్ మిమి చక్రవర్తిని బురిడీ కొట్టించాడు ఓ వ్యక్తి. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మిమి చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యారు.

ఎక్కడ చూసినా మోసగాళ్ళే. చివరకు ప్రజల ప్రాణాలతో కూడా ఈ నకిలీగాళ్ళు ఆడుకుంటున్నారు. కరోనా వైరస్ టీకా కార్యక్రమం పేరుతో హీరోయిన్ మిమి చక్రవర్తిని బురిడీ కొట్టించాడు ఓ వ్యక్తి. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మిమి చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యారు. వివరాలలోకి వెళితే... 


కోల్ కతా కార్పొరేషన్ కమీషనర్ గా నమ్మించిన దేవాంజన్ దేవ్ అనే వ్యక్తి, కరోనా టీకా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. కరోనా టీకా పట్ల ప్రజల్లో అపోహలు ఉన్న నేపథ్యంలో, వాటిని తొలగించడానికి సామాజిక బాధ్యతగా మిమి చక్రవర్తి ఆహ్వానం మన్నించారు. దేవాంజన్ ఏర్పాటు చేసిన టీకా కార్యక్రమంలో పాల్గొన్న మిమి చక్రవర్తి కరోనా టీకా తీసుకోవడం జరిగింది. 

అయితే ఆ శిబిరంలో వాడిన టీకాలు నకిలీవని తెలుసుకొని ఆమె కంగుతిన్నారు. వెంటనే ఆమె దేవాంజన్ పై పోలీసులకు పిర్యాదు చేశారు. దేవాంజన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు నకిలీ టీకాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ నకిలీ టీకా తీసుకున్న మిమి చక్రవర్తి అనారోగ్యం బారినపడ్డారు. ఆమెకు పలు అనారోగ్య సమస్యలు తలెత్తడం జరిగింది. 


నకిలీ టీకా కారణంగా ఆమె ఆరోగ్యం పాడైందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు . అయితే డాక్టర్స్ మాత్రం నకిలీ టీకా కారణంగానే ఆమె అస్వస్థతకు గురైనట్లు అధరాలు లేవని అంటున్నారు. దేవాంజన్ పై మర్డర్ అటెంప్ట్ తో పాటు పలు సెక్షన్స్ క్రింద కేసులు పెట్టారని సమాచారం. మిమి చక్రవర్తి ప్రస్తుతం అధికార పార్టీ ఎంపీగా ఉండడం విశేషం. 
 

click me!