బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ రానే తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తాను నటించిన రొమాంటిక్ డ్రామా ‘సనమ్ తేరీ కసం’ రెండో భాగంలో నటించబోనని ప్రకటించారు. ఈ నిర్ణయానికి కారణంగా పాకిస్తానీ నటి మావ్రా హొకేన్ చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలే.
‘సనమ్ తేరీ కసం’ సినిమా ద్వారా హర్షవర్ధన్ రానే, మావ్రా హొకేన్ బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదట పెద్దగా ప్రభావం చూపించలేక పోయింది. కాని రీసెంట్ గా రీరిలీజ్ చేస్తే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రీరిలీజ్ లో ఈసినిమా 45 కోట్ల వసూళ్లు సాధించి, మొత్తంగా 53 కోట్లు గడించింది. దీంతో ఈసినిమా సీక్వెల్పై ఆసక్తి పెరిగింది. అయితే, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, హర్షవర్ధన్ రానే ఒక్క షరతుతోనే సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.
హర్షవర్ధన్ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ.. ఈ విధంగా వెల్లడించారు. నాకు ఈ సినిమాలో నటించినందకు చాలా సంతోషంగా ఉంది. సీక్వెల్ చేయాలని కూడా ఉంది. కాని ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే, నా దేశం మీద నేరుగా వ్యాఖ్యలు చేసిన నటీనటులు , ‘సనమ్ తేరీ కసం పార్ట్ 2’లో కొనసాగిస్తే నేను పాల్గొనబోనని గౌరవంగా తెలియజేస్తున్నాను." అని ఆయన పోస్ట్ చేశారు.
ఈ వ్యాఖ్యల తాలూకు పరిణామాలు రేడిట్లో చర్చనీయాంశమయ్యాయి. హర్షవర్ధన్ నిర్ణయానికి మద్దతుగా పలు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. రానే నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. "తనకు ధైర్యం ఉంది, ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు గర్వంగా ఉంది " అంటూ అభిమానులు స్పందించారు.
ఈ ప్రకటనకు నేపథ్యం ఆపరేషన్ సిందూర్. ఏప్రిల్ 22న పహల్గాం వద్ద ఉగ్రదాడి అనంతరం, మే 7న భారత సాయుధ దళాలు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపై 24 టార్గెట్ స్ట్రైక్స్ నిర్వహించాయి. దీనిపై పాక్ నటి మావ్రా హొకేన్ స్పందిస్తూ ట్విటర్లో, భారత్ దాడిని ఖండిస్తున్నాను. నిర్దోషులు ప్రాణాలు కోల్పోయారు. అల్లా మీకు జ్ఞానం ప్రసాదించాలి," అంటూ పోస్టు చేశారు.
ఆమె వ్యాఖ్యలపై హర్షవర్ధన్ రానే తన అసహనాన్ని వ్యక్తపరచడంతో పాటు, దేశానికి మద్దతుగా నిలిచారు. ఇప్పటివరకు ఈ వివాదంపై మావ్రా హొకేన్ స్పందించలేదు. కానీ, బాలీవుడ్ వర్గాల్లో ఈ వివాదం పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, ‘సనమ్ తేరీ కసం’ సినిమాకు దర్శకత్వం వహించిన రాధికా రావు, వినయ్ సప్రు — ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన డీపక్ ముఖట్ తదితరులు ఇప్పుడు సీక్వెల్ కోసం కొత్త కథా రాసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.