
ప్రజలందరికి ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించడమే తన లక్ష్యం అంటున్నారు సోనూసూద్. అందుకోసం స్కూల్స్, ఆసుపత్రులు కట్టించాలని అనుకుంటున్నట్టు తెలిపారీ రియల్ హీరో. సోనూసూద్ పేరు నిరుడు కరోనా ప్రారంభం టైమ్ నుంచి మారుమ్రోగుతుంది. ఆయన వేలమంది వలస కార్మికులకు షెల్టర్ ఇచ్చి, అనంతరం సురక్షితంగా వారి స్వగ్రామాలకు చేరవేశారు. ఆ తర్వాత కూడా సాయం అడిగిన ప్రతి ఒక్కరికి కాదనుకుండా సాయం చేస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్లో ఆపదలో ఉన్ప పేషెంట్లకి ఆసుపత్రుల్లో బెడ్స్ ఏర్పాటు చేయించడం, ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, వెంటిలేటర్స్ అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనూ సూద్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, `కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లను చూసి నా మనసు చలించిపోయింది. నాకు సాధ్యమైన సాయం అందించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాను. ఈ సేవా కార్యక్రమాల్లో మా కుటుంబం మొత్తం నాకు అండగా ఉంది. నా భార్య, పిల్లల సోషల్మీడియా ఖాతాలకు సైతం సాయం కోరుతూ ఎంతోమంది మెస్సేజ్లు పంపుతున్నారు. వాటిని చూసిన వెంటనే వాళ్లు నాకు చెబుతున్నారు. అలా వాళ్లు కూడా నాకు సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది.
ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించేలా పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ఉంది. కానీ, అది ఇప్పుడే సాధ్యం కాని పని. ఉచిత వైద్యం అందించేలా ఆస్పత్రులు మాత్రం నిర్మించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. తప్పకుండా అది చేస్తా` అని తెలిపారు. ఇదిలా ఉంటే క్యాన్సర్తో పోరాడుతున్న అభిషేక్ జైన్ అనే కుర్రాడికి సోనూసూద్ని కలవాలనే కోరిక ఉంది. అభిషేక్ చిరకాల ఆకాంక్షను తెలుసుకున్న ఓ సేవా సంస్థ నిర్వహకులు అతడిని సోమవారం ఉదయం సోనూసూద్ ఇంటికి తీసుకువెళ్లారు. సోనూని చూసిన వెంటనే అభిషేక్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాళ్లు పట్టుకుని నమస్కారం చేశాడు. అభిషేక్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న సోనూ అతడికి ఓ గిఫ్ట్ ఇచ్చి పంపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్గా మారింది.