
సీనియర్ డైరెక్టర్ తేజ ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకున్నాడు. ప్రేమ కథలు, కొత్త నటీనటుల్ని పరిచయం చేయాలంటే తేజ పేరే వినిపించేది. ఆ తర్వాత చాలా కాలం పాటు తేజకు హిట్ లేదు. దీనితో గ్యాప్ తీసుకుని రానాతో నేనే రాజు నేనే మంత్రి చిత్రం చేశాడు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది.
ఆ తర్వాత కాజల్ తో చేసిన సీత చిత్రం ఫ్లాప్ గా నిలిచింది. ప్రస్తుతం తేజ రానా తమ్ముడు అభిరామ్ తో అహింస అనే చిత్రం చేస్తున్నాడు. నేడు తేజ పుట్టిన రోజు. తన పుట్టిన రోజు సందర్భంగా తేజ మరోకొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. ఈ చిత్ర ప్రీ లుక్ కూడా రిలీజ్ చేశారు. సినిమా టైటిల్ 'విక్రమాదిత్య'. ఇది తేజ డ్రీమ్ ప్రాజెక్టు.
ఈ చిత్ర కథకి సంబందించిన వివరాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్రిడ్జి నేపథ్యంలో 1836 బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉంటుందట. ఇది పూర్తి స్థాయి ప్రేమ కథ. ధవళేశ్వరం బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైనది ఈ ఏడాదే. ధవళేశ్వరం బ్రిడ్జికి, ప్రేమ కథకు లింక్ పెడుతూ తేజ ఒక ప్రేమ కథ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. సో ఇది పీరియాడిక్ లవ్ స్టోరీ.
మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ చిత్రంలో హీరోగా తేజ తన తనయుడు అమితవ్ ని పరిచయం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 22-02-2022 మధ్యాహ్నం 2. 22 గంటలకు ఈ చిత్రాన్ని ప్రారంభించారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం నితిన్ నటించిన జయం చిత్రం కూడా ఇదే తేదీన షూటింగ్ ప్రారంభం అయింది. తేజ ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు.