సమంతా బ్రాండ్ ఇమేజ్పైనే దిల్ రాజు ఎక్కువ నమ్మకం ఉంచారు. దీంతో కావాలని అడిగి మరి శాకుంతలం సినిమాకు సహ నిర్మాతగా ముందుకొచ్చారు.
భారీ ఎత్తున పబ్లిసిటీ చేసి, రిలీజ్ చేసినప్పటికీ “శాకుంతలం” బాక్సాఫీస్ దగ్గర మాత్రం బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. మరీ దారుణమైన టాక్ తో మాట్నీ నుంచే డ్రాప్ స్టార్ట్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్లో కో-ప్రొడ్యూసర్గా చేసిన దిల్ రాజు ఈ సినిమాపై మంచి అంచనాలే పెట్టుకున్నారు. ఇండియన్ కల్చర్, మైథలాజికల్ చిత్రాలు ఈ మధ్య పాన్ ఇండియా లెవల్లో పెద్ద హిట్ అవ్వటంతో... ఈ ప్రాజెక్ట్తో మంచి లాభాలు వస్తాయని దిల్ రాజు అనుకున్నారు.ఆయన లెక్కలు తప్పాయి. ఈ నేపధ్యంలో దిల్ రాజు స్పందిస్తూ... తన పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఇదే అతి పెద్ద నష్టం అని అన్నారు. సోమవారం, మంగళవారానికే కలెక్షన్లు లేవంటే ఫలితం ఏమిటో తమకు అర్థమైపోయిందని చెప్పారు.
"మేము కొంతమంది నార్మల్ ప్రేక్షకులను వివిధ థియేటర్లకు పంపి,రిపోర్ట్ లు తీసుకున్నాము. అప్పుడే సినిమా భవిష్యత్తు ఏమిటనేది తెలిసిపోయింది. సోమ, మంగళవారాల్లో ఒక చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేక పోయినప్పుడు, చిత్రం దెబ్బ కొట్టినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అది పికప్ అవుతుందనే భ్రమలో ఉండకూడదు.అప్పటికి ఫెయిల్యూర్ అని అంగీకరించాలి.అలాగే తన 25 ఏళ్ల కెరీర్కు శాకుంతలం పెద్ద కుదుపు ఇచ్చిందని చెప్పాడు.
మరో ప్రక్క ఈ సినిమా ఫ్లాప్ కావడంపై సమంత స్పందిస్తూ... ‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన’ అనే శ్లోకాన్ని ఇన్స్టాలో పెట్టింది. "పని చెయ్యి కానీ ప్రతిఫలం ఆశించకు" అని దీని అర్థం. ఈ టైమ్కు ఇది పెట్టిందంటే సినిమా ఫెయిల్యూర్ గురించే .నటించడం వరకే తన పని అని, ఫలితం తన చేతిలో లేదని చెప్పింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడిలో పావు వంతు కూడా కూడా రాలేదని తెలుస్తోంది.
రూ. 50 కోట్ల బడ్జెట్తో ‘శాకుంతలం’ రూపొందింది. ఇతర ఖర్చులతో కలిపి సినిమా మొత్తం బడ్జెట్ రూ.60 కోట్ల రూపాయలకు చేరింది. అయితే సినిమా విడుదలకు ముందే రూ.35 కోట్ల రూపాయలకు ఓ ఓటీటీ ప్లాట్ఫామ్కు అమ్మేశారు. అలానే శాటిలైట్ ఛానల్స్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి దిల్ రాజు ప్రయత్నించారు. కానీ వారు దిల్ రాజు అడిగిన ధర (రూ. 15 కోట్లు) చెల్లించడానికి నిరాకరించారు. దీంతో ఆ డీల్ కుదరలేదు. సినిమా రిలీజ్ అయిన తొలి రోజే డిజాస్టర్ అయ్యి కూర్చుంది. దీంతో శాటిలైట్ కంపెనీలు ఇప్పుడు మినిమం రేటు కూడా ఇచ్చి తీసుకునేలా కనిపించడం లేదు. బాక్సాఫీస్ కలెక్షన్ చూస్తే ఇప్పటివరకు వచ్చింది రూ.5 కోట్ల లోపే అని సమాచారం. కాబట్టి ఈ ప్రాజెక్ట్పై నిర్మాతలు దిల్ రాజు- గుణశేఖర్ రూ.20 కోట్లకు పైగా నష్టపోతారని తెలుస్తోంది.
సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ పాన్ ఇండియా సినిమా 'శాకుంతలం' (Shakuntalam Movie). గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో శకుంతల పాత్రలో సమంత... ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. ఏప్రిల్ 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.