ఎఫ్ 3 టీమ్ కి ఆలీ బిర్యానీ ట్రీట్

By team teluguFirst Published Jul 10, 2021, 3:40 PM IST
Highlights

దర్శకుడు అనిల్ రావిపూడి అండ్ టీమ్ కి ఆలీ సర్ప్రైజింగ్ ట్రీట్ ఇచ్చారు.ఎఫ్3 మూవీ సెట్స్ కి  వేడివేడి మటన్ బిర్యానీ తీసుకువచ్చి వారిని పసందు చేశారు.  

సీనియర్ కమెడియన్ ఆలీ ఎఫ్3 టీంని ఫిదా చేశారు ఘుమఘుమలాడే వేడి వేడి మటన్ బిర్యానీతో మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఎఫ్ 3 చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఈ హ్యాపీ మూమెంట్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 2019లో విడుదలైన ఎఫ్ 2 సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విక్టరీ వెంకటేష్, వరుణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ కామెడీ, రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. 


భారీ చిత్రాలను కాదని 2019 సంక్రాంతికి ఎఫ్2 చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీనితో ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్ 3 తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎఫ్ 3 చిత్ర షూటింగ్ కి బ్రేక్ పడింది.  అయితే ఇటీవల షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఎఫ్ 3 మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్న ఆలీ... టీమ్ సభ్యుల కోసం ఇంటిలో మటన్ బిర్యానీ తయారు చేసి తీసుకువచ్చారు. ఆలీ ఇచ్చిన బిర్యానీ ట్రీట్ కి అనిల్ రావిపూడి అండ్ టీమ్ సంతోషం వ్యక్తం చేయడంతో పాటు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. 


ఇక ఎఫ్ 3 మూవీలో మొదటి పార్ట్ లో హీరోయిన్స్ గా నటించిన తమన్నా, మెహ్రీన్ నటిస్తున్నారు. ఈ కామెడీ డ్రామాకు రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, మూవీని విడుదల చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావిస్తున్నారు. కాగా అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం బాలకృష్ణతో చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

click me!