
`ఆదిపురుష్` సినిమా అన్ని రకాలుగానూ వార్తల్లో నిలుస్తుంది. భారీ కలెక్షన్లు సాధించిన చిత్రంగానూ, మరోవైపు విమర్శలు, ఇంకోవైపు మోడ్రన్ రామాయణం అని, నెక్ట్స్ జనరేషన్కి అర్థమయ్యేలా తీశారని, ఇంకోవైపు మొత్తం మార్చేశారని, డైలాగ్లు కించపరిచేలా ఉన్నాయని, ఇలా రకరకాల కామెంట్లతో, ట్రోల్స్ తో, విమర్శలతో `ఆదిపురుష్` హాట్ టాపిక్గా మారింది. అత్యంత చర్చనీయాంశంగా మారుతున్న చిత్రంగా నిలుస్తుంది. ఓ వైపు కాంట్రవర్సియల్ మూవీగా, మరోవైపు విశేష ఆదరణ పొందుతున్న చిత్రంగా నిలుస్తుంది.
తాజాగా కలెక్టర్ చేసిన పని ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అవుతుంది. అనాథ పిల్లలకు కలెక్టర్ ఈ సినిమాని చూపించడం హైలైట్గా నిలచింది. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ నరసరావు పేటలోని అనాథ పిల్లలు, సోషల్ వెల్ఫేర్ విద్యార్థినీ, విద్యార్థులకు `ఆదిపురుష్` సినిమాని చూపించారు. సుమారు ఐదువందల మంది విద్యార్థులకు విజేత థియేటర్ లో ఈ సినిమాని త్రీడీ ఫార్మాట్లో చూపించడం విశేషం. ఇందులో స్టూడెంట్స్ తోపాటు కలెక్టర్ సినిమాని వీక్షించడం మరో విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, త్రీడీ ఫార్మేట్ లో పిల్లలు `ఆదిపురుష్` చిత్రాన్ని బాగా ఆస్వాదించారని, సినిమా చూస్తున్నంత సేపు వారి సంతోషానికి హద్దులు లేవని కలెక్టర్ చెప్పారు. `ఆదిపురుష్` చిత్రంలో రాముడిగా ప్రభాస్ నటించగా, సీతగా కృతి సనన్ నటించింది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దీనికి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ భాగస్వామ్యంతో టీ సిరీస్ సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్తో నిర్మించింది. త్రీడీలో వచ్చిన భారీ చిత్రమిది.
జూన్ 16న భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలైంది. విడుదలకు ముందే రికార్డ్ ప్రీ సేల్స్ సాధించిందీ మూవీ. తొలి రోజు ఏకంగా 140కోట్లు సాధించింది. రెండు, మూడు రోజుల్లో వంద, వంద రాబట్టింది. తొలి వీకెండ్లో 340కోట్లు రాబట్టింది. హాలీడేస్ లేని సమయాల్లో ఈ రేంజ్లో కలెక్షన్లు రావడం విశేషం. ఇక సోమవారం నుంచి కలెక్షన్లు తగ్గాయి. సోమవారం 35కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా లాంగ్ రన్లో ఐదు వందల కోట్లకు టచ్ అవుతుందా? లేదా అనేది చూడాలి. కానీ ఈ సినిమాపై వివాదాలు దీనికి ప్లస్ అవుతుండటం విశేషం.