
ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయోద్యమ యోధుడిగా ప్రకటించాలని కోరుతూ తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి భారత ప్రధాని కార్యాలయానికి రాసిన లేఖకు స్పందించిన పీఎంఓ దీనిపై తగు చర్యలు తీసుకోవాలని అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలకు.. సంబంధిత అధికారులకు సూచించినట్లు సమాచారం.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తాజాగా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించిన అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సిపాయిల తిరుగుబాటు కన్నా పదేళ్ల ముందే.. అంటే స్వాతంత్రం రావటానికి వందేళ్ల ముందే స్వాతంత్ర సమరయోధుడిగా పోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఖ్యాతి తాజాగా వెలుగులోకి వస్తుండటంతో.. తెలుగు వారి నుంచి ఉయ్యాలవాడ ఖ్యాతి ప్రపంచానికి చాటాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను దేశశవ్యాప్తంగా పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలని, పార్లమెంట్, తెలుగు రాష్ట్రాల్లో సహా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో, ముఖ్య పట్టణాల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాలు పెట్టాలని, ఉయ్యాలవాడ జయంతి శతాబ్ది ఉత్సవాలు నిర్వహించి ప్రతియేటా జాతీయ సెలవుగా ప్రకటించాలని, అన్ని రాజకీయ పార్టీల్లో, యూనివర్సిటీల్లో, విద్యా సంస్థల్లో స్మారకోపన్యాసాలు నిర్వహించాలని, ఉయ్యాలవాడలో నరసింహారెడ్డిని ఉరితీసిన చోట మెమరియల్ హాల్ నిర్మించాలని, నరసింహారెడ్డిపై పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా లేఖలో కోరారు జగదీశ్వర్ రెడ్డి.
ఈ నెల 11-05-2017 న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరితాత్మక స్మారక యాత్ర లో భాగంగా ఉయ్యాలవాడ గ్రామంలో వారికి నివాళీ అర్పించి ....ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని జాతీయ వీరుడు గా గుర్తించాలని కోరుతూ ఒక వినతిపత్రం పంపారు. వెంటనే స్పందించి దీనిపై తగిన చర్యలు చేపట్టవలసిందిగా ప్రధాని కార్యాలయం సంబంధిత శాఖ ను ఆదేశించడం గమనార్హం.
మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటిస్తున్న చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న నేపథ్యంలో... తాజాగా ప్రదాని కార్యాలయం దీనిపై స్పందించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 125కోట్ల భారీ బడ్జట్ తో తెరకెక్కనుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బేనర్ పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.