
మెగాస్టార్ చిరంజీవి గతేడాది ట్విట్టర్లోకి అడుగుపెట్టారు. ఏక కాలంలో ఆయన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ని ప్రారంభించారు. ప్రస్తుతం సోషల్ మీడియా హవా సాగుతుంది. సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాగా మారిపోయింది. దీంతో చిరుకి కూడా సోషల్ మీడియాలోకి రాక తప్పలేదు. ఎంట్రి ఇచ్చిన రోజు నుంచి ఆయన చాలా చురుకుగా ఉంటున్నారు. ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. వారికి రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారు. దాదాపు ఒక మిలియన్ ఫాలోవర్స్ కి చేరుకున్నారు చిరు.
అయితే చిరంజీవి మాత్రం ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నాడు. ఆయన ఎవరో పెద్ద సెలబ్రిటీనో, రాజకీయ నాయకుడో కాదు, లిరిక్ రైటర్ కావడం విశేషం. అవును చిరంజీవి ఫాలో అవుతున్న ఒకే ఒక్కరు పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి. అయితే ఈ విషయం ఓ నెటిజన్ ద్వారా బయటకు వచ్చింది. ఇప్పుడు హైలైట్గా మారింది. చిరంజీవి ఫాలో అవుతున్న ఒకే ఒక్కడు అనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఓ నెటిజన్ రామజోగయ్య శాస్త్రికి ట్యాగ్ చేశారు.
'సర్, మీరు గమనించారో లేదో చిరంజీవి గారు ట్విట్టర్ లో ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి మీరు. మీ సుసంపన్నమైన జ్ఞానానికి అది చిరంజీవి గారు మీకు ఇచ్చిన బహుమతి' అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన రామ జోగయ్య శాస్త్రి.. `చిరంజీవి సర్ ప్రేమ, ఆశీర్వాదాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కొండంత సంతోషంగా ఉన్నాను` అని పేర్కొన్నారు రామజోగయ్యశాస్త్రి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే చిరంజీవి వ్యక్తిత్వానికి ఇదే నిదర్శనమని, కలానికి, కళకి ఆయన ఇచ్చే గౌరవమని ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇది ట్విట్టర్లో తెగ వైరల్ అవుతుండటం విశేషం.
ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కాజల్ హీరోయిన్గా, రామ్చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని మొదటి పాట `లాహే లాహే.. `ని ఇటీవల విడుదల చేశారు. తొలి సాంగే సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. ఈ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి సంగీతం అందిస్తున్నారు. `లాహే లాహే` పాటని ఆయనే రాయడం విశేషం. ఈ పాట విడుదలై రెండు రోజుల్లోనే ఎనిమిది మిలియన్స్ కిపైగా వ్యూస్ని పొందింది.